
లక్నో: నీరవ్ మోదీతో కలిసి బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి వేలకోట్ల దోచుకున్న బిలియనీర్ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ వ్యవహారం ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. సాక్షాత్తూ బ్యాంకు ఉద్యోగులే ఈ ఘరానా మోసగాడితో కుమ్మక్కు కాగా.. బీటెక్ చదివిన ఏడుగురు యువకులు మాత్రం అతన్ని కోర్టుకు ఈడ్చారు.
జైపూర్లోని రాజస్థాన్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్కు బీటెక్ గ్రాడ్యుయేట్లు గత రెండేళ్లుగా అతనిపై న్యాయపోరాటం చేస్తున్నారు. ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్లో గీతాంజలి జెవెలరీ రిటైల్ ఫాంచైజ్ను తెరవాలని బీటెక్ విద్యార్థులు భావించారు. ఇందుకోసం క్రౌడ్ ఫండింగ్, తనఖా అప్పులతోపాటు తల్లిదండ్రుల నుంచి కొంత అడిగి మొత్తం రూ. 3 కోట్లు సేకరించారు. ఎలక్టానిక్ ఇంజినీర్ వైభవ్ ఖురానియా (24), ఐటీ ఇంజినీర్ దీపక్ బన్సాల్ (23) నేతృత్వంలో వీరు ఆర్ఎం గ్రీన్ సొల్యూషన్స్ సంస్థ స్థాపించారు. అయితే, ఈ సంస్థ ద్వారా లాభాలు ఆర్జించాలన్న వారి కలలు కల్లలయ్యాయి. రూ. 1.5 కోట్ల సెక్యూరిటీ సొమ్ము తీసుకొని గీతాంజలి సంస్థ థర్డ్గ్రేడ్, నాసిరకం వజ్రాలు, రత్నాలు పంపించడంతో బిత్తరపోయారు. దీనిపై వారు కోర్టును ఆశ్రయించారు. ఈ ఆరోపణలు నిజమైతే చోక్సీని అరెస్టు చేయాలని సాకేత్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే, ఈ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని చోక్సీ గత ఏడాది ఆగస్టులో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.