పారిపోయిన ‘పైసల దొంగలు’ 21 మంది! | ED 21 declared fugitive economic offenders Nirav Modi Vijay Mallya among list | Sakshi
Sakshi News home page

పారిపోయిన ‘పైసల దొంగలు’ 21 మంది!

May 2 2026 1:29 PM | Updated on May 2 2026 1:45 PM

ED 21 declared fugitive economic offenders Nirav Modi Vijay Mallya among list

దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి, వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన 'ఆర్థిక నేరగాళ్ల'పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా మొత్తం 21 మందిని 'పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు'గా (FEO) ప్రకటించింది.

ఎవరీ ఆర్థిక నేరగాళ్లు?
ఒక వ్యక్తి చేసిన ఆర్థిక నేరం విలువ రూ. 100 కోట్లు అంతకంటే ఎక్కువ ఉండి, వారిపై అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పటికీ.. విచారణను ఎదుర్కోకుండా విదేశాలకు పారిపోయి, తిరిగి రావడానికి నిరాకరిస్తే వారిని 'పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు' (FEO-Fugitive Economic Offender) గా గుర్తిస్తారు.

లిస్టులో కీలక వ్యక్తులు వీరే..
ఈడీ ప్రకటించిన 21 మంది జాబితాలో ప్రముఖ వ్యాపారవేత్తలు, గ్యాంగ్‌స్టర్ల అనుచరులు ఉన్నారు. బ్యాంకుల‌కు కన్నం వేసిన ప్రముఖ వ్యాపారవేత్తలు నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, బ్రిటన్‌కు చెందిన వివాదాస్పద ఆయుధ సరఫరాదారు సంజయ్ భండారీ, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు, దివంగత ఇక్బాల్ మిర్చి భార్య హజ్రా ఇక్బాల్ మెమన్ ఇందులో ఉన్నారు.

అంతేకాకుండా, మెహుల్ చోక్సీ, ఇస్లామిక్ బోధకుడు జాకీర్ నాయక్, మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ వంటి వారిని కూడా ఎఫ్‌ఈవోలుగా ప్రకటించే ప్రక్రియ ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని ఈడీ వెల్లడించింది.

భారీగా రికవరీ
గత రెండేళ్లలో (2024-25, 2025-26) ఈడీ కార్యకలాపాలు అత్యంత వేగవంతమయ్యాయి. ఇప్పటివరకు సుమారు రూ. 2,178.34 కోట్ల విలువైన ఆస్తులను ఏజెన్సీ జప్తు చేసింది. ఈ 21 మందిలో తొమ్మిది మందిని కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే ఎఫ్ఈఓలుగా ప్రకటించడం విశేషం. మొత్తంగా 54 మంది వ్యక్తులపై ప్రస్తుతం ఎఫ్ఈఓఏ (FEOA) చట్టం కింద చర్యలు కొనసాగుతున్నాయి.

సంజయ్ భండారీ కేసులో కీలక మలుపు
ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీపై ఈడీ కీలక వివరాలను వెల్లడించింది. 2016లో ఆదాయపు పన్ను దాడుల తర్వాత నేపాల్ మీదుగా లండన్‌కు పారిపోయిన భండారీపై 2017లో రెడ్ నోటీసు జారీ అయింది. దర్యాప్తులో అతనికి రూ. 655 కోట్ల విదేశీ ఆదాయం, రూ. 100 కోట్లకు పైగా విదేశీ ఆస్తులు ఉన్నట్లు తేలింది. షెల్ కంపెనీల ద్వారా యూఏఈ, బ్రిటన్‌లలో పెట్టిన పెట్టుబడులను జప్తు చేయాలని ఈడీ కోర్టును కోరింది.

పరారీలో ఉన్న నేరగాళ్లు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని, వారిని భారత్‌కు రప్పించడంతో పాటు ఆస్తుల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించామని ఈడీ తన నివేదికలో స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement