భళా..బాలమేధావి..! | Student Innovative Guiding Sensor Glasses For Blind People Odisha | Sakshi
Sakshi News home page

భళా..బాలమేధావి..!

Dec 30 2019 1:06 PM | Updated on Dec 30 2019 1:06 PM

Student Innovative Guiding Sensor Glasses For Blind People Odisha - Sakshi

ప్రియవ్రత సాహు, అంధుల కోసం ఆవిష్కరించిన కళ్లజోడు

ఒడిశా, భువనేశ్వర్‌: మనకున్న తెలివితేటలకు కాస్త సృజనాత్మకత పదును పెడితే అద్భుత ఆవిష్కరణలు సాధ్యమవుతాయనే విషయాన్ని నిరూపించోడో బాలుడు. బాలమేధావిగా, సైంటిస్ట్‌ బుడతుడిగా పేరొందిన ప్రియవ్రత సాహు 8వ తరగతి చదువుతున్నాడు.  ప్రభుత్వం కల్పిస్తున్న అత్యాధునిక సదుపాయాలతో సమాజంలో నిత్యం తారసపడే విభిన్న పరిస్థితుల పట్ల స్పందించాడు. వృథా నుంచి ఉపయోగకరమైన పరికరాలను ఆవిష్కరించడం వైపు దృష్టి సారించాడు. ఇదే దిశగా ప్రయత్నం చేసి, అంధకారంతో కంటిచూపు కొరవడిన వారి కోసం గైడింగ్‌ సెన్సార్‌ కళ్లజోడును ఆవిష్కరించాడు.ఈ కళ్లజోడు అంధులు, బధిర వర్గాలకు ఎంతో ఉపకరించే ఉపకరణం. అల్ట్రాసోనిక్‌ సెన్సార్, బజర్, వైబ్రేటర్‌ మోటార్‌ అనుసంధానంతో ఈ కళ్లజోడు పనిచేస్తుంది. ముందుకు సాగుతున్న మార్గంలో ఎదురయ్యే అవాంతరాలను బజర్‌ ధ్వనితో  గైడింగ్‌ సెన్సార్‌ కళ్లజోడు సకాలంలో హెచ్చరిస్తుంది. అల్ట్రాసోనిక్‌ సెన్సార్, బజర్‌ సదుపాయాలతో ఆవిష్కరించిన ఈ ప్రత్యేక కళ్లజోడు అంధులకు మాత్రమే ఉపయోగపడుతుంది.

గూగుల్‌ మ్యాప్‌తో ...
ప్రియవ్రత సాహు ఆవిష్కరించిన ఈ గైడింగ్‌ సెన్సార్‌ కళ్లజోడు మరిన్ని హంగులతో తుది మెరుగులు దిద్దుకుంటుంది. ఈ కళ్ల జోడుకు జీపీఎస్‌ మోటార్, స్పీకర్‌ జోడించనున్నట్లు ఈ బుడత సైంటిస్టు చెబుతున్నాడు. ఈ దశ విజయవంతమైతే కంఠ ధ్వనితో గూగుల్‌ మ్యాప్‌ వ్యవస్థను అనుసంధానం చేసేందుకు వైజ్ఞానిక పరిశోధన కొనసాగిస్తున్నాడు. ఈ సదుపాయం కళ్లజోడుతొడుగుకున్న వారు ఉన్న ప్రాంతం వివరాలను ఇట్టే తెలియజేస్తుంది.

సృజనాత్మకత..
గ్రామంలో పలువురు అంధులు తొడుగుకుంటున్న నల్ల కళ్లజోడు ప్రయోజనం శూన్యంగా భావించిన ప్రియవ్రత సాహు అధునాతన కళ్లజోడు ఆవిష్కరణ వైపు వేశాడు. తొడుగుకున్న కళ్లజోడు అంధులు, చెవిటి వర్గాలకు ఉపయోగపడే రీతిలో అత్యాధునిక కళ్లజోడు ఆవిష్కరించాలనే కృత నిశ్చయాన్ని పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులతో పంచుకున్నాడు. అక్కడి నుంచి ఆయన సృజనాత్మకత వైజ్ఞానిక బాటలోకి అడుగిడింది. జాజ్‌పూర్‌ జిల్లా పురుషోత్తంపూర్‌ అడంగా గ్రామం ప్రహ్లాదచంద్ర బ్రహ్మచారి ఉన్నత పాఠశాలలో ప్రియవ్రత సాహు 8వ తరగతి విద్యార్థి. కేంద్ర ప్రభుత్వం, నీతీఆయోగ్‌ సౌజన్యంతో ఈ పాఠశాలలో అటల్‌ టింకరింగ్‌ లేబొరేటరీ పనిచేస్తుంది. బాల్య దశలో వైజ్ఞానిక ఆలోచనలను ప్రేరేపించడం ఈ లేబోరేటరీ ధ్యేయం. ప్రధానంగా వ్యర్థ, వినియోగించిన సామగ్రిని వైజ్ఞానిక రీతిలో పునర్వినియోగం పట్ల అటల్‌ టింకరింగ్‌ లేబొరేటరి ప్రేరేపిస్తుంది. ఆదివారం వంటి సెలవు దినాల్లో కూడా ప్రియవ్రత సాహు లేబొరేటరీలో నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండడం, గమనించిన సైన్స్‌ ఉపాధ్యాయుడు తుఫార్‌కాంతి మిశ్రా విద్యార్థిని వెన్నుతట్టి ప్రోత్సహించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ అద్భుత ఆవిష్కరణ చూసిన ఉపాధ్యాయులు, సహచరులు, గ్రామస్తులు ఆ విద్యార్థిని మెచ్చుకుంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement