అమ్మకానికి పటేల్‌ విగ్రహం..! | Statue Of Unity For Sale On OLX | Sakshi
Sakshi News home page

అమ్మకానికి పటేల్‌ విగ్రహం: ధర 30 వేలకోట్లు

Apr 5 2020 2:23 PM | Updated on Apr 5 2020 2:34 PM

Statue Of Unity For Sale On OLX - Sakshi

గాంధీనగర్‌ : భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మికంగా నిర్మించిన ఐక్యత విగ్రహం (సర్దార్‌ వల్లభాయ్ పటేల్) విగ్రహాన్ని ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టారు. విగ్రహం ధరని రూ.30వేల కోట్లుగా నిర్ధారించారు. దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న తరుణంలో బాధితులకు వైద్య సదుపాయాలు, ఆస్పత్రుల నిర్మాణానికి ఈ నిధులను ఉపయోగించాలని భావించారు. అయితే పటేల్‌ విగ్రహాన్ని ఓఎల్‌ఎక్స్‌లో పెట్టింది ఓ నెటిజన్‌. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం ఓఎల్ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టాడు. ‘ఎమర్జెన్సీ... స్టాచ్చూ ఆఫ్ యూనిటీ విగ్రహం అమ్మబడును. ఇది కావాలనుకున్న వారు రూ.30వేల కోట్లు చెల్లిస్తే సరిపోతుంది’ అని పోస్ట్‌ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారడంతో.. ఫేక్‌ పోస్ట్‌గా గుర్తించి ఒఎల్‌ఎక్స్‌ సంస్థ ఆ పోస్ట్‌ను వెంటనే తొలగించింది.

కాగా పటేల్‌ విగ్రహాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. కాగా ఓఎల్ఎక్స్ లో దీని ఖరీదుని రూ.30వేల కోట్లుగా నిర్ధారించడంతో తొలుత చూసిన వారంతా షాక్‌కి గురయ్యారు. భారత్‌ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అంకితమిస్తూ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని 2018 అక్టోబర్ 31న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. 182 మీటర్ల ఎత్తయిన ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా గుర్తింపు పొందింది. గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలోని సాధు బెట్ దీవిలో దీన్ని నిర్మించారు. కాగా దీనిని ఆవిష్కరించిన దగ్గర నుంచి పర్యటకులు ద్వారా ఇప్పటి వరకు 82 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని నిర్వహకులు తెలుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement