అయోధ్య తీర్పుపై సల్మాన్‌ తండ్రి స్పందన | Salim Khan Said We Need Better Schools In 5 Acre Place In Ayodhya | Sakshi
Sakshi News home page

అయోధ్య తీర్పుపై సల్మాన్‌ తండ్రి స్పందన

Nov 10 2019 4:36 PM | Updated on Nov 10 2019 5:24 PM

Salim Khan Said We Need Better Schools In 5 Acre Place In Ayodhya - Sakshi

ముంబై: శతాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య భూమి హక్కుల వివాదంపై సుప్రీంకోర్టు శనివారం తుదితీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఆలయనిర్మాణం కోసం మూడునెలల్లో అయోధ్య ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అదేసమయంలో మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీవక్ఫ్‌బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యం పలువురు ముస్లిం ప్రముఖులు స్పందిస్తూ.. తీర్పును వ్యతిరేకించారు. కొందరు మాత్రం సుప్రీం తీర్పును స్వాగతించారు. ఇందులో​ భాగంలో బాలీవుడ్‌ లెజండరీ గీత రచయిత, బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీమ్‌ఖాన్‌ అయోధ్య-బాబ్రీ మసీదు భూవివాదం తీర్పుపై స్పందించారు. ముస్లిం సోదరులకు మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీ వక్ఫ్‌ బోర్డుకు కేటాయించిన 5 ఎకరాల స్థలంలో మసీదు బదులుగా విద్యాసంస్థలు నిర్మించాలని సూచించారు.

ప్రవక్త వివరించిన విధంగా ఇస్లాం మతంలోని రెండు ధర్మాలు.. ప్రేమ, క్షమకు ముస్లిం సోదరులు కట్టుబడి ముందుకు సాగాలన్నారు. తీర్పు ఇవ్వటం పూర్తి అయిందని, ఇక మళ్లీ ఈ వివాదాన్ని తిరగతోడకుడదన్నారు. ప్రేమ, క్షమను చూపాలన్నారు. ఇంత సున్నితమైన తీర్పు ప్రకటించిన తర్వాత దేశ వ్యాప్తంగా శాంతి, సామరస్యాన్ని కొనసాగించిన విధానం ప్రశంసనీయమన్నారు. ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం పరిష్కరించబడటాన్ని స్వాగతిస్తున్నానని సలీమ్‌ తెలిపారు. కాగా ముస్లింలు దీని గురించి వ్యతిరేకంగా చర్చింటానికి బదులుగా.. తమ ప్రాథమిక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలని కోరారు. తీర్పు ప్రకారం కేటాయించిన 5 ఎకరాల స్థలంలో ముస్లిం పిల్లల విద్యకు ఉపయోగపడే.. పాఠశాల, కాలేజీలు నిర్మిస్తే మంచిదన్నారు.

అదే విధంగా ముస్లింల అసలు సమస్య సరైన విద్యలేకపోవడమని.. కావున అయోధ్య తీర్పుకు స్వస్తిపలికి కొత్త ఆరంభానికి నాందిపలకాలన్నారు. నమాజు ఎక్కడైన పరిశుభ్రమైన ప్రదేశంలో చేసుకోవచ్చు.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముస్లింలకు నాణ్యమైన విద్యకోసం పాఠశాలు, కాలేజీలు చాలా అవసరమన్నారు. సుమారు 22 కోట్లమంది ముస్లింలు నాణ్యమైన విద్యను పొందేలేకపోతున్నారని తెలిపారు. విద్యతో చాలా సమస్యలు పరిష్కరించబడుతాయని సలీమ్‌ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శాంతి కోసం పాటుపతున్నారని.. ఆయన విధానాల్ని అంగీకరిస్తానని తెలిపారు. తమకు(ముస్లిం) శాంతి అవసరమని, భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు. కాగా బాలీవుడ్‌ గీత రయిచతల్లో సలీమ్‌-జావేద్‌ ద్వయం పలు బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాల పాటలకు సాహిత్యం అందించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement