విద్యతోనే ఎవరికైనా గౌరవం దక్కుతుందని, విద్యలేని....
భివండీ, న్యూస్లైన్: విద్యతోనే ఎవరికైనా గౌరవం దక్కుతుందని, విద్యలేని నాడు ఎన్ని సంపదలున్నా వ్యర్థమేనని ముఖ్య అతిథులు కిరణ్ వాంఖడే, విజయ్ దలాల్ తెలిపారు. తెలుగు సమాజ్ శిక్షణ్ సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలుగు విద్యార్థులకు రెండు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి.
ఈ సందర్భంగా విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులకు కూడా సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించారు. సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న కన్నెరి ప్రాంతంలోని పద్మశాలి హైస్కూలు, భావన రుషి తెలుగు మీడియం పాఠశాలలో మంగళవారం , కామత్ఘర్లోని పద్మశాలి ఇంగ్లీష్ మీడియం హైస్కూలు అండ్ జూనియర్ కాలేజీలో బుధవారం ఈ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన కిరణ్ వాంఖడే, విజయ్ దలాల్ విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాంఖడే మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో విద్య అందరికీ అవసర మని స్పష్టం చేశారు. చదువుకున్న వారు ఎక్కడికి వెళ్లినా వారికి గౌరవం దొరుకుతుందన్నారు.
తల్లిదండ్రులు దూరంగా ఉంటే విద్యార్థులు అభివృద్ధి సాధిస్తారని వివరించారు. అనంతరం దలాల్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచి మంచి మార్గంలో నడుస్తూ యోగ, ధ్యానం లాంటివి చేస్తూ చదివితే వారు తప్పకుండా గొప్పవారవుతారని పేర్కొన్నారు. ఇళ్లల్లో పిల్లలు టీవీల్లో వచ్చే అనవసర కార్యక్రమాలు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అప్పుడే వారికి చదువుకునేందుకు తగిన సమయం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ట్రస్టీలు దాసి అంబాదాస్, బైరీ రామస్వామి, చైర్మన్ డాక్టర్ పాము మనోహర్, కుందెన్ పరుషోత్తం, కళ్యాడపు భూమేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, తమ సంస్థ తరఫున రెండు రోజులపాటు నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని ఆ సంస్థ అధ్యక్షుడు గుండ్ల శంకర్ చెప్పారు.