Raah Group Offers Reward to Telangana Police for Encounter of Disha Case Accused | దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌.. ఆ పోలీసులకు రివార్డు! - Sakshi
Sakshi News home page

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌.. ఆ పోలీసులకు రివార్డు!

Dec 6 2019 2:43 PM | Updated on Dec 6 2019 3:58 PM

Raah Group Offers Reward To Telangana Police Who Involved Disha Accused Encounter - Sakshi

హిసార్‌(హరియాణా) : దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై దేశంలోని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ప్రశంసలు కురిపించడమే కాకుండా పోలీసులకు రివార్డు కూడా ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. హరియాణాకు చెందిన రాహ్‌ గ్రూప్ ఫౌండేషన్‌ చైర్మన్‌ నరేశ్‌ సెల్పార్‌ దిశ కేసులో ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. తెలంగాణ పోలీసుల చర్యను అభినందిస్తున్నట్టు నరేశ్‌ పేర్కొన్నారు. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులకు రివార్డు అందజేయనున్నట్టు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఒక్కో పోలీసుకు రూ. లక్ష చొప్పున రివార్డు ఇవ్వనున్నట్టు చెప్పారు. రాహ్‌ గ్రూప్‌ ప్రకటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.  

కాగా, దిశపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన సంగతి తెలిసిందే. దిశ ను కాల్చివేసిన ప్రదేశంలో పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తున్న సమయంలో నలుగురు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులపైకి రాళ్లతో దాడిచేసేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో నలుగురు మృగాళ్లు అక్కడిక్కడే మృతిచెందారు. 

Advertisement
 
Advertisement
Advertisement