కాంగ్రెస్, బీజేపీలకు ‘ఆమ్ ఆద్మీ’ దెబ్బ | Pre-poll survey: Hung Assembly in Delhi as AAP hits BJP, Congress hard | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, బీజేపీలకు ‘ఆమ్ ఆద్మీ’ దెబ్బ

Oct 31 2013 1:55 AM | Updated on Aug 20 2018 3:46 PM

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యతరాదని.. హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎన్నికలకు ముందు నిర్వహించిన ఒక సర్వే చెప్తోంది.

 సీఎన్‌ఎన్-ఐబీఎన్, ద వీక్ సర్వే
 న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యతరాదని.. హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎన్నికలకు ముందు నిర్వహించిన ఒక సర్వే చెప్తోంది. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నేతృత్వంలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీని, ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో లాభపడవచ్చని ఆశిస్తున్న ప్రతిపక్ష బీజేపీని.. కొత్తగా బరిలోకి దిగిన మూడో శక్తి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) గట్టి దెబ్బతీస్తుందని ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. సీఎన్‌ఎన్-ఐబీఎన్ వార్తా చానల్, ద వీక్ వారపత్రిక, సీఎస్‌డీఎస్ సంయుక్తంగా నిర్వహించిన ప్రీ-పోల్ సర్వే ఫలితాల ప్రకారం.. దేశంలో ఏకైక నగర రాష్ట్రమైన ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ ఈసారి 19-25 సీట్లకు మాత్రమే పరిమితవుతుంది. కొత్త పార్టీ ఏఏపీ కూడా అందరినీ ఆశ్యర్యచకితులను చేస్తూ 19-25 సీట్లు గెలుచకుంటుంది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఈ రెండిటికన్నా కాస్త మెరుగ్గా 22-28 సీట్లలో గెలుపొందుతుంది.
 
  ఎన్నికల్లో ఇవే ఫలితాలు గనుక వస్తే ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు దాదాపు అసాధ్యమే అవుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనా పార్టీ నుంచి భారీగా ఫిరాయింపులకు పాల్పడితే తప్ప ప్రభుత్వ ఏర్పాటు సాధ్యంకాదని చెప్తున్నారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 40.3 ఓట్ల శాతంతో 43 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 36.3 శాతం ఓట్లతో 23 సీట్లు గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 27 శాతం, బీజేపీకి 29 శాతం, ఏఏపీకి 28 శాతం ఓట్లు వస్తాయని సర్వే పేర్కొంది. ఇక సీఎం అభ్యర్థులుగా కేజ్రీవాల్ 25 శాతం ప్రజా మద్దతుతో అగ్రస్థానంలోకి దూసుకొచ్చారు. ప్రస్తుత సీఎం షీలాదీక్షిత్‌కు 16 శాతం, బీజేపీ నేత విజయ్‌గోయల్‌కు 10 శాతం మంది మద్దతు పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement