
రైతు ప్రయోజనాలకే పెద్దపీట
భూసేకరణ చట్టంలో సవరణలకు సంబంధించిన బిల్లుపై పార్లమెంటు వేదికగా పోరుకు ప్రతిపక్షాలు కత్తులు నూరుతున్న..
* ప్రభుత్వ ప్రాథమ్యం అదే
* భూసేకరణలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికే సవరణలు
* పార్లమెంటు ఉభయసభల సంయుక్త భేటీలో రాష్ట్రపతి స్పష్టీకరణ
* సభ సజావుగా సాగేందుకు సహకరించండి; ఎంపీలకు ప్రణబ్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: భూసేకరణ చట్టంలో సవరణలకు సంబంధించిన బిల్లుపై పార్లమెంటు వేదికగా పోరుకు ప్రతిపక్షాలు కత్తులు నూరుతున్న నేపథ్యంలో.. భూసేకరణ వల్ల నష్టపోతున్న రైతులు, వారి కుటుంబాల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ తొలి ప్రాథమ్యమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. అయితే, ప్రతిపక్షాలు తీవ్రంగా విభేదిస్తున్న వివాదాస్పద భూసేకరణ ఆర్డినెన్స్లో మార్పు చేర్పులేమైనా ఉంటాయా అన్న విషయం మాత్రం ఆయన ప్రస్తావించలేదు. బడ్జెట్ సమావేశాల తొలిరోజు సోమవారం పార్లమెంటు సెంట్రల్ హాళ్లో ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. పార్లమెంటు సజావు నిర్వహణకు సహకరించాల్సిందిగా ఎంపీలందరికీ విజ్ఞప్తి చేశారు. పరస్పర సమన్వయంతో ప్రగతిదాయక చట్టాల రూపకల్పనకు కృషి చేయాలన్నారు.
మోదీ ప్రభుత్వం కొలువుతీరిన తరువాత ఈ 9 నెలల్లో సాధించిన విజయాలను, ప్రారంభించిన స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, జనధన్ యోజన, దేశ, విదేశాల్లో నల్లధనం వెలికితీత కోసం తీసుకున్న చర్యలు.. తదితర కార్యక్రమాలను ప్రణబ్ ప్రస్తావించారు. చివరగా ‘ఒకే ఇండియా.. శ్రేష్టమైన ఇండియా(ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్).. జైహింద్’ అంటూ ప్రసంగాన్ని ముగించారు. ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులు, ఉభయ సభల్లోని ప్రతిపక్ష నేతలు, కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ.. తదితరులు ముందువరుసలో కూర్చొని రాష్ట్రపతి ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
- రైతుల శ్రేయస్సుకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. భూసేకరణ విధానంలో పారదర్శకత పాటిస్తూ నష్టపోతున్న రైతులకు న్యాయమైన పరిహార హక్కు లభించేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కీలక ప్రాజెక్టుల నిర్మాణం, గ్రామీణ గృహనిర్మాణం, మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణం తదితర మౌలిక వసతుల కోసం జరిపే భూసేకరణలో పాలనాపరమైన ఇబ్బందులను సాధ్యమైనంతగా తగ్గించే లక్ష్యంతో భూ సేకరణ, పునరావాస చట్టంలో సవరణలు చేసి మెరుగుపర్చారు.
- ఆహార భద్రతకు రైతే కీలకం. మార్కెట్ సంస్కరణలు, సాగులో ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం రైతుల శ్రేయస్సుకు ఉపయోగపడ్తాయి. ఫుడ్ ప్రాసెసింగ్ను కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయి. గ్రామాల్లో సాగునీటి సదుపాయాల కోసం ఈ ప్రభుత్వం ‘ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన’ను ప్రారంభించింది.
- ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం దేశ రక్షణకు సవాలుగా మారాయి. రాష్ట్రాల సహకారంతో వాటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
- ‘అందరినీ కలుపుకుని.. అందరి అభివృద్ధి’ అనేది ఈ ప్రభుత్వ నినాదం. ఆ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
- దేశ విదేశాల్లోని నల్లధనం వెలికితీతకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఆ దిశగా.. చట్టపరమైన, శాసన సంబంధమైన చర్యలతో పాటు పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.
- పొరుగు దేశాలు ముఖ్యంగా దక్షిణాసియా దేశాలతో సత్సంబంధాల విషయంలో ముందడుగు వేశాం. మన ప్రజలు, మన సరిహద్దులను రక్షించుకోగలమనే విషయాన్ని వారికి స్పష్టం చేశాం.
- అమెరికా, రష్యా, చైనా దేశాధ్యక్షుల భారత పర్యటనలు ఆయా దేశాలతో మన సంబంధాలను కొత్త శిఖరాలకు చేర్చాయి.
- ప్రజాస్వామ్యమనే దేవాలయానికి పార్లమెంటు పరమపవిత్రమైన గర్భగుడి వంటిది. పార్లమెంటు తమ ఆశలు, ఆకాంక్షలు తీర్చగలదని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆ బాధ్యతను నిర్వర్తించేందుకు, దృఢమైన ఆధునిక భారతదేశ నిర్మాణం దిశగా ఎంపీలంతా సహకారం, సమన్వయంతో సాగాలి.
- భారీ ఆర్థిక వ్యవస్థల్లో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనది. తాజా అంచనాల ప్రకారం 2014-15లో ఇండియా 7.4 వృద్ధి రేటు సాధించగలదు. ద్రవ్యోల్బణం అత్యంత కనిష్ట స్థాయికి చేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
- న్యాయ సంస్కరణలకు ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఆ దిశగా తీసుకు వచ్చిందే సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ‘నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్’. అలాగే, కాలం చెల్లిన చట్టాలను గుర్తించేందుకు నియమించిన కమిటీ అలాంటి 1741 చట్టాలను గుర్తించింది.
- పన్ను వ్యవస్థలోనూ సమూల మార్పులకు ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పరోక్ష పన్నుల విధానాన్ని సులభతరం చేసేందుకు వస్తు, సేవల పన్ను బిల్లును ప్రవేశపెట్టాం. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా జనధన యోజనను ప్రారంభించాం. ఈ పథకం కింద ఇప్పటివరకు 13.2 కోట్ల బ్యాంక్ ఖాతాలు, 11 వేల కోట్ల డిపాజిట్లు, 11.5 కోట్ల రూపే కార్డుల జారీతో.. ఈ పథకం విజయవంతమైంది.
- అవినీతి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటూనే.. నిజాయితీపరులైన అధికారులను కాపాడేందుకు చర్యలు చేపట్టాం.
- 15 కోట్లమంది సబ్సీడీ ఎల్పీజీ వినియోగదారుల్లో దాదాపు 75% మందికి సబ్సీడీ మొత్తాలు వారి బ్యాంక్ ఖాతాల్లో జమవుతున్నాయి.
- రానున్న ఏడేళ్లలో మొత్తం విద్యుదుత్పత్తిలో ప్రత్యామ్నాయ విద్యుత్తు వాటా 15 శాతానికి చేరేలా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
చప్పగా సాగింది: విపక్షం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగం కొత్తదనమేం లేకుండా చప్పగా సాగిందని విపక్షాలు విమర్శించాయి. యూపీఏ పథకాలనే కొత్త పేరుతో ఏకరువు పెట్టారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ ఇన్నాళ్లూ చేసిన ప్రకటనల పునరుక్తే రాష్ట్రపతి ప్రసంగమని, పైగా, అది చాలాసేపు కొనసాగడంతో సభ్యులకు నిద్రొచ్చేసిందని జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వ పనితీరు ‘పని తక్కువ.. మాటలెక్కువ’గా ఉందన్న విషయం రాష్ట్రపతి ప్రసంగంతో స్పష్టమైందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎద్దేవా చేశారు.