కోడి కూర..చిల్లు గారె..!
చిన్నారులను ఊరిస్తూ మంత్రుల విందు
భువనేశ్వర్: అట్టడుగు స్థాయిలో సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు, పాలన వ్యవహారాల్లో లోటుపాట్లను అకస్మాత్తుగా పసిగట్టడంలో ఆతిథ్యాలు, అతిథి సత్కారాలు, విందులు– వినోదాలకు అతీతంగా మంత్రులు క్షేత్ర స్థాయిలో ఆకస్మికంగా పర్యటించి సందర్శించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తరచూ గుర్తు చేస్తున్నారు. అయితే ఆయన మార్గదర్శకాలు ఇలా బహిరంగంగా దారి తప్పుతున్నాయి. ఈ చిత్రంలో విలాసవంతమైన కోడి మాంసం కూరతో విందు ఆరగిస్తున్న ప్రముఖుల్లో ఒకరు రాష్ట్ర మంత్రి, మరొకరు మాజీ ఎంపీ కావడం విచారకరం. రాయగడ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జ్యోతి ప్రకాశ్ పాణిగ్రాహి, పార్లమెంటు మాజీ సభ్యుడు జిహ్న హికాకా విద్యార్థుల నడుమ విలాసవంతమైన కంచాల్లో పిల్లలతో కలిసి భిన్నంగా విందు ఆరగించిన దృశ్యం సోషల్ మీడియా ప్రసారంలో దుమారం రేపుతోంది.