
ప్యాసింజర్ రైళ్ల వేగం పెంచేందుకు 9 కారిడార్లు
ప్యాసింజర్ రైళ్ల వేగాన్ని గంటకు 160-200 కిలోమీటర్ల వరకూ పెంచేందుకుగాను చెన్నై-హైదరాబాద్, నాగపూర్-సికింద్రాబాద్ సహా 9 రైల్వే కారిడార్లను గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది.
న్యూఢిల్లీ: ప్యాసింజర్ రైళ్ల వేగాన్ని గంటకు 160-200 కిలోమీటర్ల వరకూ పెంచేందుకుగాను చెన్నై-హైదరాబాద్, నాగపూర్-సికింద్రాబాద్ సహా 9 రైల్వే కారిడార్లను గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. శతాబ్ది ఎక్స్ప్రెస్, తదితర రైళ్లను గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో న్యూఢిల్లీ-ఆగ్రా మార్గంలో ఈ నెల 3న నడిపి పరీక్షించామని, దీంతో ఆ వేగానికి ట్రాక్ పటిష్టంగానే ఉంటుందని తేలినట్లు ఈ మేరకు శుక్రవారం రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా రాజ్యసభకు రాతపూర్వకంగా వెల్లడించారు. ఎల్హెచ్బీ కోచ్లు, ఎలక్ట్రిక్ లోకోలను కూడా 180 కి.మీ. గరిష్ట వేగం వరకూ విజయవంతంగా నడిపినట్లు తెలిపారు. ఈ పరీక్షల్లో భద్రత, ట్రాకు పటిష్టత, సాంకేతికపరమైన అన్ని అంశాలను పరిశీలించినట్లు మంత్రి మనోజ్ సిన్హా పేర్కొన్నారు.