ఎంపీల కోసం ముస్తాబవుతున్న ఫ్లాట్లు | New Flats Ready For MPs In North Avenue | Sakshi
Sakshi News home page

ఎంపీల కోసం ముస్తాబవుతున్న ఫ్లాట్లు

Jun 6 2019 1:04 PM | Updated on Jun 6 2019 1:52 PM

New Flats Ready For MPs In North Avenue - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో కొత్త ఎంపీలు కొలువుతీరనున్న వేళ ఎంపీలకు నూతన ఫ్లాట్లను ప్రభుత్వం సమకూర్చనుంది. దేశ రాజధానిలో అధికారిక నివాసం లేని ఎంపీలకు ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో వసతి అందించడంలో దుబారా అవుతుండటంతో లోక్‌సభ సెక్రటేరియట్‌ ఖర్చు తగ్గించే పనిలో పడింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని హై సెక్యూరిటీ జోన్‌ నార్త్‌ ఎవెన్యూ ప్రాంతంలో ఎంపీలకు అత్యాధునిక వసతులతో ఫ్లాట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు అందించేందుకు ఇప్పటివరకూ అన్ని హంగులతో 36 ఫ్లాట్లు సిద్ధమయ్యాయి.

కేంద్ర ప్రజా పనుల శాఖ నిర్మించిన ఈ ఫ్లాట్లు అన్ని ఆధునిక సదుపాయాలతో పాటు ఎంపీల అవసరాలకు అనుగుణంగా రూపొందాయి. ఈ డూప్లెక్స్‌ ఫ్లాట్లు భూకంపాన్ని తట్టుకునే విధంగా, గ్రీన్‌ బిల్డింగ్‌ విధానాలను అనుసరిస్తూ నిర్మితమయ్యాయి. ప్రతి అపార్ట్‌మెంట్‌లో రెండు ఫోర్లతో పాటు సెం‍ట్రలైజ్డ్‌ ఏసీ, చిన్నపాటి దేవాలయం, సర్వెంట్‌ రూమ్‌, బేస్‌మెంట్‌ పార్కింగ్‌, ఎటాచ్డ్‌ వాష్‌రూమ్‌ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు.

విద్యుత్‌ బిల్లును తగ్గించేందుకు ఫ్లాట్స్‌పై సోలార్‌ ప్యానెల్స్‌, సెన్సర్‌ లైట్లు అమర్చారు. ఇక 300 మంది ఎంపీల కోసం నిర్మిస్తున్న ఈ ఫ్లాట్లు అన్నీ సిద్ధమయ్యేవరకూ మరికొందరు ఎంపీలకు ఆయా రాష్ట్రాల అతిధి గృహాలతో పాటు నగరం మధ్యలో పునరుద్ధరించిన వెస్ర్టన్‌ కోర్టులోనూ వసతి కల్పించాలని లోక్‌సభ సెక్రటేరియట్‌ భావిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement