పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు నూతన సర్కారు నుంచి బంపర్ బహుమతి అందుకోనున్నారు. కొత్తగా ఎన్నికైన 243 మంది ఎమ్మెల్యేల కోసం పట్నాలోని దరోగా రాయ్ పాత్లో నిర్మించిన 181 అధునాతన డ్యూప్లెక్స్ల నిర్మాణం పూర్తయ్యింది. అంతకుముందు ఉన్న 62 బంగ్లాలకు అదనంగా నిర్మించిన ఈ నివాసాలు మొత్తం 44 ఎకరాల క్యాంపస్లో విస్తరించి ఉన్నాయి. ఈ నూతన భవనాలను చూసినవారంతా ఇవి ‘ఇళ్లా.. ఇంద్ర భవనాలా?’అని అంటున్నారు.
ప్రతి యూనిట్ సుమారు 3,693–3,700 చదరపు అడుగుల విస్తీర్ణంతో 4BHK ఫార్మాట్లో ఈ ఇళ్లను నిర్మించారు. వాటిలో విలాసవంతమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రతి డ్యూప్లెక్స్ లేఅవుట్ ఎంతో ప్లానింగ్తో కనిపిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఎమ్మెల్యేలకు అవసరమైన గెస్ట్ రూమ్, పీఏ రూమ్, ఆఫీస్ రూమ్,కిచెన్ ఉన్నాయి. మొదటి అంతస్తులో మాస్టర్ బెడ్రూమ్తో సహా మూడు గదులు, మొత్తం ఆరు టాయిలెట్లు ఉన్నాయి. అన్ని గదులలో ఫర్నీచర్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే హాస్టల్, క్యాంటీన్, కమ్యూనిటీ సెంటర్ తదితర అదనపు సౌకర్యాలను క్యాంపస్లో ఏర్పాటు చేశారు.
ఈ కొత్త కాంప్లెక్స్ పర్యావరణ అనుకూలతలతో నిర్మితమయ్యింది. భవన నిర్మాణంలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. వర్షపునీటి సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు, మురుగునీటిని శుద్ధి చేసి, తోటల పెంపకానికి తిరిగి ఉపయోగించే ప్రక్రియను అమలు చేస్తున్నారు. విద్యుత్తును ఆదా చేయడానికి ఎల్ఈడీ వీధి దీపాలను వినియోగిస్తున్నారు. క్యాంపస్లో పచ్చదనాన్ని పెంపొందించడానికి పచ్చని చెట్లను పెద్ద ఎత్తున నాటారు. ఈ అత్యాధునిక సౌకర్యాలు, పర్యావరణ అనుకూల చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రతి డ్యూప్లెక్స్పై దానిని కేటాయించిన ఎమ్మెల్యే పేరు, నియోజకవర్గ సంఖ్యను రాశారు. తద్వారా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలతో మరింత సమర్థవంతంగా కనెక్ట్ అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది.
ఇది కూడా చదవండి: సాయుధపోరుతో మొదలై.. ‘హిడ్మా’ జీవితం సాగిందిలా..


