కోల్కతా: శ్రీరామ నవమి సందర్భంగా కోల్కతా నగరంలో నిర్వహించే సీతారాముల విగ్రహాల ఊరేగింపులో ఎక్కువగా గుర్రపు బగ్గీలను ఉపయోగిస్తారు. శ్రీరాముడి శోభాయాత్రలో ప్రత్యేకంగా అలరించిన ఈ గుర్రపు బగ్గీలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే, ఈ గుర్రపు బగ్గీలను అద్దెకు ఇచ్చేవారిలో 90 శాతం ముస్లింలే ఉండడం గమనార్హం. వారికి ఈ గుర్రపు బగ్గీలే జీవనాధారం. హిందువులు ఘనంగా జరుపుకునే శ్రీరామ నవమి పండగ రోజున భక్తులు శ్రీ సీతారాముల విగ్రహాలను, వారి వేషాధారణ కలిగిన కళాకారులను ఈ గుర్రపు బగ్గీ రథాలలోనే ఊరేగిస్తారు. అయితే ఈ గుర్రపు బగ్గీలను పూలతో అలంకరించి, గుర్రలను శుభ్రంగా కడిగి ఊరేగింపులో గుర్రాలను అదుపుచేస్తూ, శోభాయాత్రను ఘనంగా నిర్వహించడంలో స్థానిక ముస్లిం కార్మికుల పాత్ర ప్రముఖమైనది.
సాధారణ సమయంలో అంతగా పని ఉండదని, పెళ్లిళ్లు, ఊరేగింపుల సమయంలోనే తమకు ఇంత పని దొరుకుతుందని గుర్రపు బగ్గీలు నడిపేవారు తెలిపారు. గతంలో ఉన్నంత గిరాకీ ఇప్పడు లేదని అన్నారు. శ్రీరామ నవమి ఊరేగింపుల్లో మాత్రం భలే గిరాకీ ఉంటుందని ఆనందం వ్యక్తం చేశారు. నాలుగు షిఫ్టుల్లో పని చేస్తామని, ఒక్క శ్రీరామ నవమి రోజు నాడే మూడు, నాలుగు నెలలకు సరిపడ ఆదాయం వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.