ఆలయానికి పొలం దానం చేసిన ముస్లిం
సాక్షి, న్యూఢిల్లీ : భిన్న మతాలున్న సమాజంలో ఆ మతాల ప్రజల మధ్య శాంతి, సామరస్యాలు కొనసాగాలంటే అందుకు ప్రతి ఒక్కరి కృషి, సాయం ఎంతో అవసరం. పైగా మత విధ్వేశాలు రగులుతున్న సమయంలో అది మరీ అవసరం. కేరళలోని మల్లప్పురం జిల్లా చంతన్గొట్టుపురం గ్రామంలో కుందాడ శివాలయం ఉంది. అయితే శివాలయానికి అవసరమైన కోనేరు మాత్రం లేదు. ఆలయానికి అది తవ్వేంత స్థలం కూడా లేదు.
పక్కనే నంబియార్తోడి ఆలీ ముస్లింకు 4.7 ఎకరాల పొలం ఉంది. అందులో కోనేరులాగా ఉపయోగపడే చిన్న కుంట ఉంది. దాన్ని కొనేందుకు అడగాలని శివాలయం కమిటీ నిర్ణయించింది. అసలే ముస్లిం, ఆలయానికంటే స్థలం అమ్ముతాడో, లేదోనని ముందుగా సంశయించింది. ముందయితే అడుగుదామని అడిగింది. వారు అనుమానించినట్లే ముస్లిం స్థలాన్ని అమ్మనన్నాడు. అయితే మొత్తం స్థలం కాకుండా కుంట ప్రాంతాన్ని, ఆలయం నుంచి అక్కడికి వెళ్లివచ్చేందుకు అవసరమైన దారిని ఉచితంగా ఇస్తానని చెప్పారు. అలాగే ఆ మేరకు ఆలయ కమిటీకి ఆ స్థలాన్ని ఉచితంగా రిజిస్టర్ చేసి ఇచ్చారు.
మొన్న శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయం కమిటీ వారు ఆ ముస్లిం వ్యక్తిని పిలిపించి ఉచితరీతిన సన్మానించారు. ఆయన వినతిపై ఆయన ఫొటోను మాత్రం ఆలయ కమిటీ విడుదల చేయలేదు. మనుషుల్లో కూడా మహానుభావులుంటారంటే ఇలాంటివారేనేమో!
సంబంధిత వార్తలు