ఎంపీలు వేతనాలు, అలవెన్సులు పెంచాలని సమాజ్వాదీపార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ కోరారు.
న్యూఢిల్లీ: ఎంపీలు వేతనాలు, అలవెన్సులు పెంచాలని సమాజ్వాదీపార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ కోరారు. రాజ్యసభలో బుధవారం ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలు తర్వాత ఎంపీల వేతనాలు కేబినెట్ సెక్రటరీల జీతం కంటే తక్కువగా ఉన్నాయని తెలిపారు. సమాజ్వాదీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ కూడా గతేడాది ఇదే అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తారు. ఎంపీల వేతనాలు, అలవెన్సులు పెంచాలని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం.. ఎంపీల వేతనాలు 100 శాతం పెంచనుందని గతేడాది వార్తలు వచ్చాయి. దీంతో ఎంపీల నెల వేతనం రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పెరగనుందని ప్రచారం జరిగింది. ఏడో వేతన సంఘం సిఫార్సులు అమలు చేసిన తర్వాత కేబినెట్ కార్యదర్శి నెల వేతనం రూ. 2.5 లక్షలకు పెరిగింది.