
‘ఫేస్ లెస్ గా మారిన క్యాష్ లెస్’
పార్లమెంట్ లో మోదీ సర్కారు ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు.
కోల్ కతా: పార్లమెంట్ లో మోదీ సర్కారు ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. పాతపెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ లో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇది చాలా దురదృష్టకర పరిణామని వ్యాఖ్యానించారు.
‘నోట్ల రద్దుపై పార్లమెంట్లో మాట్లాడాలని విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు? నోట్ల రద్దుపై ప్రభుత్వం తప్పటడుగు వేసిందని దీనిబట్టి అర్థమవుతోంది. క్యాష్ లెస్ ఇప్పుడు ఫేస్ లెస్ గా మారింద’ని మమత మండిపడ్డారు. సామాన్య ప్రజలను నోట్ల కష్టాలకు గురిచేస్తున్న నరేంద్ర మోదీకి ప్రధాని పదవిలో కొనసాగే అర్హత లేదని ఆమె నిన్న ధ్వజమెత్తారు. దేశానికి ఏంచేస్తే మంచి జరుగుతుందో మోదీకి తెలియలేదని అన్నారు.