గుజరాత్‌ అల్లర్ల కేసులో మాజీ మంత్రికి ఊరట | Maya Kodnani Acquitted In Naroda Patiya Massacre Case | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ అల్లర్ల కేసులో మాయా కొద్నానీకి ఊరట

Apr 20 2018 12:26 PM | Updated on Aug 21 2018 2:51 PM

Maya Kodnani Acquitted In Naroda Patiya Massacre Case - Sakshi

భారతీయ జనతా పార్టీ మాజీ మంత్రి మాయా కొద్నానీ

సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌ అల్లర్ల కేసులో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మాజీ మంత్రి మాయా కొద్నానీ నిర్దోషిగా విడుదల అయ్యారు. 2002 గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సమయంలో అహ్మదాబాద్‌లోని నరోదా పటియాలో నరమేథం జరిగింది. ఈ నరమేథం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాయా కొద్నానీని శుక్రవారం గుజరాత్‌ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సంశయ లాభం కింద కొద్నానీని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.

2002లో నరోదా నరమేథంలో 100 మంది ముస్లింలు హత్యకు గురయ్యారు. వృత్తి రీత్యా వైద్యురాలైన కొద్నానీ అల్లర్లకు పురిగొల్పారని ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఘటన మరుసటి రోజున ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం అల్లర్లకు కొద్నానీయే రెచ్చగొట్టారని తేల్చింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు. అప్పటినుంచి 10 ఏళ్ల పాటు సాగిన విచారణ అనంతరం ప్రత్యేక కోర్టు కొద్నానీకి జీవిత ఖైదును విధించింది.

2014లో కొద్నానీ బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న భజరంగ్‌ దళ్‌ నేత బాబు భజరంగీని దోషిగా తేల్చిన న్యాయస్థానం క్రింది కోర్టు ఇచ్చిన శిక్షను ఖరారు చేసింది. భజరంగీకి 2012లో ప్రత్యేక కోర్టు 28 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఇరువురితో పాటు ఆరోపణలను ఎదుర్కొంటున్న మరో 29 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement