యోగి రాష్ట్రంలో బీఫ్ పెట్టలేదని.. పెళ్లి క్యాన్సిల్! | Sakshi
Sakshi News home page

మాకు బీఫ్ పెట్టరా అంటూ.. వరుడి ఫ్యామిలీ!

Published Sun, Jun 18 2017 12:32 PM

యోగి రాష్ట్రంలో బీఫ్ పెట్టలేదని.. పెళ్లి క్యాన్సిల్!

లక్నో: ఓ వైపు యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక గోమాంసాన్ని నిషేధించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు బీఫ్ వడ్డించలేదని ఆగ్రహంతో వరుడి కుటుంబీకులు వివాహాన్నే ఆపేయడం దుమారం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ధరియాగఢ్ లోని భోట్ పోలీస్ స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. ఆ వివరాలు.. రాంపూర్ కు చెందిన యాదవ్ వర్గీయుల ఇంట్లో శనివారం వివాహం జరగాలని నిర్ణయించారు. పెళ్లి మండపంలో ఇరు వర్గాల వారి బంధువులతో సందడి వాతావరణం నెలకొంది. ఓ వైపు భోజనాలు ప్రారంభించారు. వరుడి తరఫు వారు తమకు బీఫ్ వడ్డించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో గో మాంసంపై నిషేధం ఉందని ఎంత మొత్తుకున్నా వరుడి బంధువులు వినలేదు. మమ్మల్ని అవమానిస్తారా అంటూ పెళ్లి ఆపేసేందుకు సిద్ధమయ్యారు. చివరికి కట్నంగా కారు కూడా ఇవ్వాలని.. లేకుంటే తమ దారిన వెళ్లిపోతామంటూ వధువు తండ్రిని హెచ్చరించారు. అందుకు వధువు తండ్రి నిరాకరించడంతో పెళ్లి రద్దుచేస్తున్నట్లు ప్రకటించి వరుడు బంధువులు వెళ్లిపోయారు. ఈ విషయంపై వరుడిపై, అతడి బంధువులపై వధువు తరఫువారు ఫిర్యాదు చేశారని స్టేషన్ ఆఫీసర్ రాజేశ్ కుమార్ ఆదివారం మీడియాకు తెలిపారు. కారు కావాలంటే కొన్ని రోజుల తర్వాత కష్టపడి ఇవ్వగలమని, కానీ నిషేధం ఉన్న గోమాంసాన్ని అడిగి ఇబ్బందుల పాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు.

Advertisement
Advertisement