లాక్‌డౌన్‌ : కూతురును కాపాడుకోవాలనే తాపత్రయంతో..

Lucknow Woman Trudges 900 km To Save Daughter From Coronavirus - Sakshi

లక్నో : మండుటెండలో ఒక చేతిలో బ్యాగు పట్టుకుని మరో చేత్తో తన మూడేళ్ల కూతురును భుజాలపై ఎత్తుకొని తన సొంతూరుకు వెళ్లడానికి ఏదైనా వాహనం లిఫ్ట్‌ ఇస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తోంది. ఇంతలో ఒక ట్రక్కు స్పీడుగా ఆమెను దాటుకుంటూ వెళ్లిపోయింది. ఇక చేసేదేంలేక కాలినడకనే తన ప్రయాణాన్ని ప్రారంభించింది.తన కూతురిని కరోనా బారీ నుంచి కాపాడాలనే ఆ తల్లి తాపత్రయం ఇండోర్‌ నుంచి 900 కిలోమీటర్ల దూరంలో ఉ‍న్న అమేథీకి నడిపించేలా చేసింది. వివరాలు..  మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రుక్సానా బానో తన భర్త అఖ్విబ్‌తో కలిసి యూపీలోని అమేథీలో నివసిస్తుంది. వారిద్దరికి నర్గీస్‌ అనే మూడేళ్ల కూతురుంది. 8వ తరగతి వరకు చదువుకున్న రుక్సానాకు కూతురంటే పంచప్రాణాలు. తాను బతికేదే తన కూతురు కోసమని రుక్సానా చాలాసార్లు స్పష్టం చేసింది. రుక్సానా భర్త అఖ్విబ్‌ ఒక హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తుండగా, ఆమె ఇళ్లలో పనిమనిషిగా చేస్తుంది. వారిద్దరికి కలిపి వచ్చే 9వేల రూపాయల జీతంలో ప్రతీ నెల రూ. 3వేలు తన కూతురు నర్గీస్‌ పేరిట బ్యాంకులో డిపాజిట్‌ చేసేవారు. తాము చదవుకోకపోయినా నర్గీస్‌ మాత్రం చక్కగా చదువుకోవాలనే ఆలోచన రుక్సానాలో బలంగా ఉండేది. ఇలా హాయిగా సాగిపోతున్న వారి జీవితంలో కరోనా మహమ్మారి అలజడి సృష్టించింది.
(ఎమ్మెల్యే సీతక్కను అడ్డుకున్న పోలీసులు)

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభించడంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌  విధించింది. లాక్‌డౌన్‌ వారి పాలిట శాపంగా మారింది. ఇద్దరు తమ ఉపాధి కోల్పోవడంతో అంతవరకు తాము దాచుకున్న డబ్బులు చూస్తుండగానే ఆవిరయ్యాయి.అయితే తన కూతురు రుక్సానా పేరిట బ్యాంకులో ఉ‍న్న డబ్బును తీయడానికి రుక్సానా మనసు ఒప్పుకోలేదు. ఎంత కష్టమైనా సరే ఆ డబ్బు తీయద్దని భావించింది.అప్పటికే ఇండోర్‌ ప్రాంతంలో కరోనా కోరలు చాస్తుంది.  అయితే కేంద్రం లాక్‌డౌన్‌ను గతవారం మళ్లీ  పొడిగించడంతో పరిస్థితి దారుణంగా తయారైంది.ఇక్కడే ఉంటే తన కూతురు కరోనా బారీన పడుతుందేమోనని భయపడింది. ఉన్న ఊరును వదిలి అమేధీలోని సొంతూరుకు వెళ్లాలని అనుకుంది. ఇదే విషయాన్ని భర్తతో చెబితే తాను ఇప్పుడు రాలేనని , ఇక్కడే ఉంటానని రుక్సానాకు చెప్పాడు. భర్త తన వెంట రావడానికి సముఖత వ్యక్తం చేయకపోవడంతో అఖ్విబ్‌ను వదిలేసి సొంతూరుకు వెళ్లాలని నిశ్చయించుకుంది.

ఇంతలో తనకు తెలిసిన బంధువులు కూడా అమేధీలోని సొంతూరుకు వెళుతున్నారని తెలుసుకుంది. ఒక బ్యాగులో దుస్తులు, బిస్కెట్లు, జామ్‌ పెట్టుకొని కూతురు నర్గీస్‌ను తీసుకొని ఆ బృందంతో కలిసి బుధవారం రాత్రి ప్రయాణం ప్రారంభించింది. ట్రక్కు, లారీల్లో లిఫ్ట్‌ అడిగి వారంతా కలిసి ఎలాగోలా లక్నోకు చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ ప్రయాణం ప్రారంభించారు. రుక్సానా తన బిడ్డ నర్గీస్‌కు ఎండ వేడి తగలకుండా ముఖానికి ఒక చిన్న గుడ్డ కప్పి తన బంధువులతో కలిసి ప్రయాణం చేస్తుంది. ఇదే విషయాన్ని రుక్సానాను అడగితే.. ' లాక్‌డౌన్‌ మా పాలిట శాపమైంది. అయినా సరే నా కూతురును కాపాడుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నా. ఎంతకష్టమైనా సరే సొంతూరుకు వెళ్లేవరకు ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది' అని పేర్కొంది.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top