ప్రేమించిన యువతి కత్తి పోట్లకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ప్రేమికుడు ఆమెకు ఆస్పత్రిలోనే తాళి కట్టాడు.
చెన్నై: ప్రేమించిన యువతి కత్తి పోట్లకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ప్రేమికుడు ఆమెకు ఆస్పత్రిలోనే తాళి కట్టాడు. తమిళనాడులోని తిరువారూరు జిల్లా వవుసినగర్కు చెందిన కలెసైల్వి అనే యువతి... అదే ప్రాంతానికి చెందిన ఇళయారాజా ప్రేమించుకున్నారు. వారి ప్రేమను కలెసైల్వి బంధువులు వ్యతిరేకించారు. దీంతో కలెసైల్వి ప్రేమికుని ఇంట్లో ఆశ్రయం పొందింది. వివాహానికి తాళి, ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు గురువారం రాత్రి ఇళయరాజా అమ్మాపేటకు వెళ్లాడు.
ఆ సమయంలో కలెసైల్వి చిన్నాన్నలు కలియపెరుమాల్, రఘుపతి, అతని కుమారుడు ఆనంద్, కలెసైల్వి తమ్ముడు మణికంఠన్ అక్కడికి వచ్చారు. ఆగ్రహించిన వారు కలెసైల్విపై కత్తితో దాడిచేశారు. తీవ్ర గాయాలపాలైన కలెసైల్విని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని తంజావూరు వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇళయరాజా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కలెసైల్వి మెడలో శుక్రవారం ఉదయం తాళికట్టి తన అర్ధాంగిగా చేసుకున్నాడు. కాగా, దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదుచేసి రఘుపతిని అరెస్టుచేశారు. అతన్ని నీడామంగళం కోర్టులో హాజరుపరచి కస్టడీకి తరలించారు.