ప్రణబ్ను ప్రశంసల్లో ముంచెత్తిన అద్వాణీ
సాక్షి, న్యూఢిల్లీ : నాగపూర్లో గురువారం జరిగిన ఆరెస్సెస్ కార్యక్రమంలో హాజరయ్యేందుకు తనకు అందిన ఆహ్వానాన్ని అంగీకరించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయాన్ని బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వాణీ ప్రశంసించారు. ఆరెస్సెస్ ఆహ్వానాన్ని మన్నించడంలో ప్రణబ్ చూపిన చొరవ, ముందుచూపు కొనియాడదగినవని అద్వాణీ పేర్కొన్నారు. కాగా ప్రణబ్ ముఖర్జీ ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరు కావడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా పలువురు కాంగ్రెస్ నేతలు ఆయన ప్రసంగాన్ని సమర్ధించారు.
ఆరెస్సెస్ వేదికపై ప్రణబ్ కాంగ్రెస్ భావజాలాన్ని విస్పష్టంగా వివరించారని సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం పేర్కొన్నారు. అయితే ఆరెస్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ హాజరు కావడాన్ని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ తప్పుపట్టారు. ఆరెస్సెస్ విషప్రచారంపై గతంలో తమకు శిక్షణ తరగతులు నిర్వహించిన పాతతరం కాంగ్రెస్ నేతల్లో ఒకరైన ప్రణబ్ ఆ సంస్థ కార్యక్రమానికి ఎందుకు హాజరయ్యారని నిలదీశారు. గతంలో దెయ్యంలా కనిపించిన ఆరెస్సెస్ ఇప్పుడు ధర్మసంస్థలా కనిపిస్తోందా అని ప్రణబ్ను ఆయన ప్రశ్నించారు.