రోగి కపాలం ముక్క పోగొట్టిన ఆస్పత్రి!! | Kolkata hospital loses a part of patient skull | Sakshi
Sakshi News home page

రోగి కపాలం ముక్క పోగొట్టిన ఆస్పత్రి!!

Jun 28 2014 2:22 PM | Updated on Sep 2 2017 9:31 AM

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నగరంలో చిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. రూబీ ప్రభుత్వాస్పత్రిలో శస్త్రచికిత్స చేయడానికని ఉంచిన 23 ఏళ్ల యువకుడి కపాలం ముక్క ఒకటి మాయమైపోయింది.

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నగరంలో చిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. రూబీ ప్రభుత్వాస్పత్రిలో శస్త్రచికిత్స చేయడానికని ఉంచిన 23 ఏళ్ల యువకుడి కపాలం ముక్క ఒకటి మాయమైపోయింది. ఆ యువకుడికి గత జనవరిలో అదే ఆస్పత్రిలో మెదడుకు శస్త్రచికిత్స చేశారు. ఆ సమయంలో కపాలంలో కొంత భాగాన్ని తీశారు. దాన్ని మళ్లీ అమర్చాల్సి ఉంది. అయితే, ఇప్పుడు ఆ కపాలం ముక్క కాస్తా కనపడకుండా పోయిందని అక్కడి న్యూరోసర్జన్లు చెబుతున్నారు. ఇక వేరే మార్గం ఏమీ లేకపోవడంతో.. కృత్రిమ కపాలం ముక్కను అమరుస్తామని చెబుతున్నారు.

అర్ణబ్ దత్తా (23) అనే యువకుడు.. తన తండ్రి మరణించడంతో తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని గత సంవత్సరం జనవరిలో లేక్ గార్డెన్స్ అపార్టమెంట్ పైనుంచి కిందకు దూకాడు. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న అతడి తలకు తీవ్రగాయం కావడంతో వెంటనే రూబీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి తలకు శస్త్రచికిత్స చేశామని, కపాలంలో కొంతముక్క తీసి.. తర్వాత అమరుస్తామని వైద్యులు చెప్పారు. తీరా ఇప్పుడు వెళ్తే.. ఆ ముక్క కనిపించడంలేదని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement