ఆసుపత్రిలో మాయమైన రోగి వేలు

ప్రతీకాత్మక చిత్రం - Sakshi

కలకత్తా : కలకత్తాలోని ఓ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ వ్యక్తి వేలు కోల్పోయాడు. ఎడమ చేతి వేలు కాస్తా తెగిపడటంతో అతను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అయితే సర్జరీ చేసే  సమయంలో డాక్టర్లు ఆ వేలును పోగొట్టారు. తెగిన వేలును ఓ శుభ్రమైన ప్లాస్టిక్‌ కవర్‌లో ఉంచి ఆసుపత్రి యజమాన్యానికి అప్పగించామని, అయినా, ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ చూస్తూ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శస్త్రచికిత్స చేసే సమయంలో తెగిన వేలు పోయిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కలకత్తాకు చెందిన నీలోత్‌పాల్‌ చక్రవర్తి(38) హౌరా జిల్లాలో కెమికల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తన కార్యాలయం సమీపంలో ప్రమాదానికి గురవ్వడంతో అతని ఎడమ చేతి వేలు కాస్తా తెగిపోయింది. వెంటనే సహోద్యోగులు స్థానిక ప్రవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. తెగిపోయిన వేలును ఓ ప్లాస్టిక్‌ సంచిలో వేసి ఆసుపత్రి యజమాన్యానికి అప్పజెప్పారు. అయితే డాక్టర్లు చికిత్స చేసే ముందు ఆ వేలును పోగొట్టారు. కేవలం  ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే తన భర్త వేలు పోయిందని  బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే ఆ తెగిన వేలు పనికిరానిదని, తిరిగి అతికించడం కూడా సాధ్యం కాదని ఆస్పత్రి సిబ్బంది వాదిస్తున్నారు. అయినా వేలు పోవడంపై దర్యాప్తు చేస్తున్నామని అంటున్నారు.  అయితే, తెగిన వేలును శుభ్రమైన పాలిథిన్ సంచిలో ఉంచి.. మంచులో భద్రపరిచినట్టయితే.. దానిని తిరిగి అమర్చే అవకాశం ఉంటుందని, ప్రస్తుత కేసులో తెగిపడిన వేలు రక్తంతో తడిసి ఉందని, దాన్ని మళ్లీ అతికించినా ప్రయోజనం ఉండదని ఆస్పత్రి ప్లాస్టిక్‌ సర్జన్‌ అనుపమ్‌ చెబుతున్నారు. ఒకవేళ వేలు అతికించినా, అతికే అవకాశం కేవలం పది శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు.. ఆస్పత్రిలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించనున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top