ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై ఆగ్రహం | President Murmu Protocol Row: Centre Seeks Response From West Bengal Government | Sakshi
Sakshi News home page

ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై ఆగ్రహం

Mar 9 2026 4:55 AM | Updated on Mar 9 2026 4:55 AM

President Murmu Protocol Row: Centre Seeks Response From West Bengal Government

రాష్ట్రపతి సదస్సు, ప్రయాణ మార్గాన్ని ఎందుకు మార్చారు?  

బ్లూ బుక్‌ నిబంధనలు ఎందుకు పాటించలేదు?  

వాష్‌ రూమ్‌లో నీటి సౌకర్యం కల్పించకపోవడం ఏమిటి?

అన్నింటిపైనా వివరణ ఇవ్వండి.. బెంగాల్‌ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం

బెంగాల్‌ సర్కారుకు కేంద్రం ఆదేశం 

న్యూఢిల్లీ/కోల్‌కతా: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ప్రొటోకాల్‌ నిబంధనలు ఉల్లంఘించడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. రాష్ట్రపతి పాల్గొనాల్సిన సంతాల్‌ గిరిజన సదస్సు వేదికను, ఆమె ప్రయాణ మార్గాన్ని హఠాత్తుగా మార్చడాన్ని తప్పుపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని బెంగాల్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రపతి ప్రొటోకాల్‌కు సంబంధించిన ‘బ్లూ బుక్‌’ నిబంధనలు ఎందుకు పాటించలేదో చెప్పాలంటూ బెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి లేఖ రాశారు. ‘‘సీఎం, మంత్రులు, సీఎస్, డీజీపీల్లో ఎవరూ రాష్ట్రపతికి స్వాగతం పలక్కపోవడం బ్లూ బుక్‌ రూల్స్‌కు విరుద్ధం.

రాష్ట్రపతికి కేటాయించిన వాష్‌ రూమ్‌లో నీటి సౌకర్యం కూడా లేదు. ఆమె ప్రయాణానికి చెత్తాచెదారంతో నిండిన మార్గాన్ని ఎంపిక చేశారు. వీటిపై వివరణ ఇవ్వండి. ప్రొటోకాల్‌ ఉల్లంఘనకు బాధ్యులైన డార్జిలింగ్‌ జిల్లా మేజి్రస్టేట్, సిలిగురి పోలీసు కమిషనర్, అదనపు జిల్లా మేజి్రస్టేట్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి’’ అని ఆదేశించారు.

బెంగాల్‌ పర్యటనకు వెళ్లిన ముర్ముకు శనివారం సీఎం మమతా బెనర్జీ గానీ, మంత్రులు గానీ స్వాగతం పలకలేదు. షెడ్యూల్‌ ప్రకారం బదాన్‌నగర్‌లో జరగాల్సిన దళిత సదస్సును చివరి నిమిషంలో బాగ్‌డోగ్రా ఎయిర్‌పోర్టు సమీపంలోకి మార్చేశారు. సరైన సమాచారం లేక జనం ఆశించినంతగా హాజరు కాలేదు. ఈ పరిణామాలపై ముర్ము తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.

ప్రొటోకాల్‌ను ఉల్లంఘించలేదు: మమత
రాష్ట్రపతి పర్యటనలో ప్రొటోకాల్‌ ఉల్లంఘన జరగలేదని మమత తేల్చిచెప్పారు. రాష్ట్రపతి సదస్సులో లోపాలుంటే ప్రైవేట్‌ నిర్వాహకులు, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియానే బాధ్యత వహించాలన్నారు. ‘‘రాజ్యాంగం పట్ల, రాష్ట్రపతి పట్ల మాకు ఎనలేని గౌరవముంది. రాష్ట్రపతిని మా తల్లిగా భావిస్తాం. ముర్మును మేం అవమానించలేదు. ఆమెకు సిలిగురి మేయర్‌ స్వాగతం పలికారు’’ అని చెప్పారు. ‘‘రాష్ట్రపతిని అవమానించే అలవాటు బీజేపీదే. గతంలో ఒక సభలో రాష్ట్రపతి నుంచుని ఉంటే ప్రధాని మోదీ మాత్రం కురీ్చలో కూర్చున్నారు’’ అని మమత విమర్శించారు. బీజేపీ అగ్ర నేత ఎల్‌కే అడ్వానీతో పాటు మోదీ కూర్చుని ఉండగా వారి పక్కన ముర్ము నుంచున్న ఫొటోను ప్రదర్శించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement