‘దారికొస్తున్న కశ్మీరం’
న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లో పరిస్థితి ప్రస్తుతం మెరుగుపడిందని, హురియత్ చర్చలకు సిద్ధంగా ఉందని ఆ రాష్ట్ర గవర్నర్ సత్య పాల్ మాలిక్ అన్నారు. కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, జితేంద్ర సింగ్ల సమక్షంలో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ చొరవ చూపినా విముఖత ప్రదర్శించిన హురియత్ నేతలు ఇప్పుడు చర్చలకు సంసిద్దత వ్యక్తం చేస్తున్నారని, శుక్రవారం ప్రార్ధనల సమయంలోనూ సమస్యలు సైతం సద్దుమణిగాయని ఆయన చెప్పుకొచ్చారు.
జమ్ము కశ్మీర్లోని యురిలో ఉగ్ర దాడి అనంతరం నిలిచిన భారత్- పాక్ చర్చలు తిరిగి ప్రారంభించాలని హురియత్ చీప్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ ప్రకటన నేపథ్యంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే ఓ వైపు హింసాత్మక ఘటనలు, ఉగ్రదాడులు జరుగుతుంటే చర్చలు జరపలేమని భారత్ పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్ గవర్నర్ పాలనలో ఉండగా ఎన్ఎన్ వోహ్రా స్ధానంలో ఈ ఏడాది ఆగస్టులో సత్య పాల్ మాలిక్ను కేంద్రం నియమించింది.