జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం
సరియైన నూట్రిషనల్ విలువలు లేని లేదా సరిపడ కేలరీలు లేని ఆహారపదార్థాలు జంక్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. చిన్నపిల్లలను ఎక్కువగా టార్గెట్ చేస్తున్న ఈ జంక్ ఫుడ్స్ను నిర్మూలించడానికి ప్రభుత్వం, కార్టూన్ ఛానల్స్లో ప్రసారమవుతున్న వీటి ప్రకటనలపై నిషేధం విధించాలని నిర్ణయించింది. జంక్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్ ప్రకటనలను నిషేధించడానికి తగిన అవకాశాలను పరిశీలిస్తున్నామని కేంద్ర సమాచార, టెక్నాలజీ జూనియర్ మంత్రి రాజ్యవర్థన్ రాథోర్ నేడు పార్లమెంట్కు తెలిపారు. దీనిపై త్వరలోనే కార్టూన్ ఛానల్స్కు ఆదేశాలను జారీచేస్తామన్నారు.
అనారోగ్యకరమైన ఈ ఫుడ్ ఉత్పత్తులను పిల్లలు తీసుకోకుండా ఉండేందుకు ఈ ఐడియా పనిచేస్తుందన్నారు. అనారోగ్యకరమైన ఫుడ్లపై చిన్న పిల్లలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని, ఇది వారి దీర్ఘకాలిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ప్రభుత్వం నిర్ణయించిన కమిటీ పేర్కొంది. ఊబకాయం వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయన్నారు. పిల్లలని టార్గెట్ చేసి వీటి ప్రకటనలను కూడా ఎక్కువగా కార్టూన్ ఛానల్స్లోనే ప్రదర్శిస్తున్నారు. పోగో, నికెలోడియాన్ వంటి పిల్లల టెలివిజన్ ఛానల్స్లో ప్రసారమయ్యే ఈ ప్రకటనలకు రెవెన్యూలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. దీంతో కార్టూన్ ఛానల్స్లో ఈ ప్రకటనలపై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.