జాట్ రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం | Haryana Cabinet clears Jats quota bill | Sakshi
Sakshi News home page

జాట్ రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం

Mar 28 2016 5:05 PM | Updated on Sep 3 2017 8:44 PM

రిజర్వేషన్ల కోసం ఆందోళనలకు దిగిన జాట్ కులస్తులు(ఫైల్ ఫొటో)

రిజర్వేషన్ల కోసం ఆందోళనలకు దిగిన జాట్ కులస్తులు(ఫైల్ ఫొటో)

విద్యా, ఉద్యోగ రంగాల్లో జాట్ కులస్తులు సహా మరో నాలుగు కులాలకు రిజర్వేషన్లు వర్తింపజేసే కీలక బిల్లుకు హరియాణా కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

చండీగఢ్: విద్యా, ఉద్యోగ రంగాల్లో జాట్ కులస్తులు సహా మరో నాలుగు కులాలకు రిజర్వేషన్లు వర్తింపజేసే కీలక బిల్లుకు హరియాణా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏప్రిల్ 3లోగా తమను బీసీ జాబితాలో చేర్చేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ జాట్లు విధించించిన డెడ్ లైన్ దృష్ట్యా ప్రభుత్వం ఆమేరకు చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాలు మార్చి 31తో ముగియనుండటంతో ఆలోపే జాట్ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

కేబినెట్ ఆమోదించిన బిల్లులోని వివరాలు ఇలా ఉన్నాయి

  • జాట్లకు రిజర్వేషన్లు కల్పించేలా బీసీ జాబితాలోనే మరో కేటగిరీని పొందుపర్చారు
  • విద్యారంగంలో, క్లాస్ 3, క్లాస్ 4 ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు
  • ఈ 10 శాతంలో 6 శాతం జాట్లకు కాగా మిగతా 4 శాతం జాట్ సిక్కులు, రోర్లు, బిష్ణోయిలకు లభిస్తుంది.
  • పదేపదే రిజర్వేషన్ల ఆందోళనలు తలెత్తకుండా హరియాణా వెనుకబడిన కులాల కమిషన్ పేరుతో ఓ శాశ్వత సంస్థను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


జాట్లకు రిజర్వేషన్ కల్పించాలంటూ ఆ కులస్తులు గత నెలలో చేపట్టిన ఆందోళనలు హింసాయుతంగా మారిన సంగతి తెలిసిందే. నాటి అల్లర్లలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోగా 300 మందికిపైగా గాయపడ్డారు. వందల సంఖ్యలో రైళ్లు నిలిచిపోయాయి. డిమాండ్లను పరిష్కరిస్తామన్న ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించిన జాట్లు.. ఏప్రిల్ 3లోగా పరిష్కారం లభించకుంటే మళ్లీ ఉద్యమిస్తామని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వడివడిగా నిర్ణయాలు తీసుకుంటున్నది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement