
కశ్మీర్లో ఎన్కౌంటర్
కశ్మీర్లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ జవాన్ గాయపడ్డారు. శ్రీనగర్ శివారులోని పాంపోర్ ప్రాంతంలోని
జవాన్కు గాయాలు
శ్రీనగర్: కశ్మీర్లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ జవాన్ గాయపడ్డారు. శ్రీనగర్ శివారులోని పాంపోర్ ప్రాంతంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అభివృద్ధి సంస్థ(ఈడీఐ) భవన సముదాయంలోకి ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులు నదివైపు నుంచి వచ్చి చొరబడ్డారు. భద్రతాదళాల దృష్టిని ఆకర్షించేందుకు ఈడీఐ కాంప్లెక్స్లోని హాస్టల్ గదిలో దుప్పట్లపైకి కాల్పులు జరిపారు. కాంప్లెక్స్ వెలుపలికి పొగ రావడంతో వెంటనే అప్రమత్తమై వచ్చిన సైనికులపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఒక సైనికుడికి గాయాలయ్యాయి. ఈడీఐ కాంప్లెక్స్ను భద్రతా దళాలు చుట్టుముట్టాయని, ఇరువైపుల నుంచి ఇంకా కాల్పులు జరుగుతున్నాయని, ఈ ఆపరేషన్ మంగళవారం కూడా కొనసాగుతుందని భద్రతాదళాల ప్రతినిధి తెలిపారు. ఉగ్రవాదులు పారిపోకుండా రాత్రిపూట నిఘాను ముమ్మరం చేశామని పేర్కొన్నారు. గత 8 నెలల్లో రెండుసార్లు ఉగ్రవాదులు ఈ భవనంపై దాడులు చేశారు. గత ఫిబ్రవరిలో ఈ భవనాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడగా.. ఇద్దరు సైనికులు, ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.