pampor
-
ముగిసిన పాంపోర్ ఎన్కౌంటర్
ఇద్దరు ఉగ్రవాదులు హతం శ్రీనగర్: శ్రీనగర్, జమ్మూ జాతీయ రహదారిలో ఉన్న పంపోర్ ప్రాంతంలోని ఈడీఐ భవనంలో దాగిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. దీంతో 56 గంటల సుదీర్ఘ ఎన్కౌంటర్కు బుధవారం తెరపడింది. ఈడీఐ భవనంలో గాలింపు చర్యలు పూర్తయ్యాయని, ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు లభ్యమయ్యాయని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. సోమవారం ఉగ్రవాదులు ఈ భవనంలోకి చొరబడిన విషయం తెలిసిందే. ఆరోజు జరిగిన కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డాడు. అప్పటి నుంచి భద్రతా దళాలు చాకచక్యంగా వ్యవహరించాయి. ఆ భవనంలో 60 గదులు ఉండటం వల్ల, ఒక్కో గదిని స్వాధీనం చేసుకోవాల్సి రావడం వల్ల ఎన్కౌంటర్కు ఎక్కువ సమయం పట్టిందని మేజర్ జనరల్ అశోక్ నౌరులా తెలిపారు. కాగా, ఉగ్రవాదులు ఈ భవనంలో చొరబడటం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. గతంలో ఫిబ్రవరి నెలలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు, ముగ్గురు ఉగ్రవాదులు, మరో పౌరుడు చనిపోయారు. కశ్మీరీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఇలాంటి భవంతిపై ఉగ్ర మూకలు తరచూ దాడి చేయడం బాధ కలిగిస్తోందని అశోక్ నౌరులా అన్నారు. -
కశ్మీర్లో ఎన్కౌంటర్
జవాన్కు గాయాలు శ్రీనగర్: కశ్మీర్లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ జవాన్ గాయపడ్డారు. శ్రీనగర్ శివారులోని పాంపోర్ ప్రాంతంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అభివృద్ధి సంస్థ(ఈడీఐ) భవన సముదాయంలోకి ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులు నదివైపు నుంచి వచ్చి చొరబడ్డారు. భద్రతాదళాల దృష్టిని ఆకర్షించేందుకు ఈడీఐ కాంప్లెక్స్లోని హాస్టల్ గదిలో దుప్పట్లపైకి కాల్పులు జరిపారు. కాంప్లెక్స్ వెలుపలికి పొగ రావడంతో వెంటనే అప్రమత్తమై వచ్చిన సైనికులపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక సైనికుడికి గాయాలయ్యాయి. ఈడీఐ కాంప్లెక్స్ను భద్రతా దళాలు చుట్టుముట్టాయని, ఇరువైపుల నుంచి ఇంకా కాల్పులు జరుగుతున్నాయని, ఈ ఆపరేషన్ మంగళవారం కూడా కొనసాగుతుందని భద్రతాదళాల ప్రతినిధి తెలిపారు. ఉగ్రవాదులు పారిపోకుండా రాత్రిపూట నిఘాను ముమ్మరం చేశామని పేర్కొన్నారు. గత 8 నెలల్లో రెండుసార్లు ఉగ్రవాదులు ఈ భవనంపై దాడులు చేశారు. గత ఫిబ్రవరిలో ఈ భవనాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడగా.. ఇద్దరు సైనికులు, ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.