ఎజెండా నిర్దేశిస్తున్న మీడియా: జైట్లీ | Sakshi
Sakshi News home page

ఎజెండా నిర్దేశిస్తున్న మీడియా: జైట్లీ

Published Mon, Mar 28 2016 12:51 AM

Directing the media agenda: Jaitley

న్యూఢిల్లీ: కేంద్ర సమాచార మంత్రి అరుణ్ జైట్లీ మీడియా తీరును మళ్లీ తప్పుపట్టారు. దాని స్వరూపం మారిందని, వార్తా సేకరణకు బదులు ‘ఎజెండా నిర్దేశిత సంస్థ’గా వ్యవహరిస్తోందని అన్నారు. రాజకీయ నేతలు కూడా అందుకు అనుగుణంగానే స్పందించాలనేలా బహుముఖ పోకడలు పోతోందన్నారు. ఈ మార్పులను ప్రభుత్వం గ్రహించిందన్నారు. ‘ఈ క్రమంలో వార్తా సేకరణ సంస్థలను గుర్తించడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాలతో పాటు సంప్రదాయ వార్తా పత్రికల్లో రిపోర్టింగ్‌కు కొంత అవకాశం ఉందనిపిస్తోంది.

ఎలక్ట్రానిక్ మీడియాలో ఇందుకు స్థానమే లేదు. ఎందుకంటే వాటిల్లో రోజురోజుకూ వార్తల ప్రాధాన్యం తగ్గిపోతోంది’ అని ఆదివారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో జైట్లీ అభిప్రాయపడ్డారు. జమ్మూకశ్మీర్‌లో కొత్తగా ఏర్పడే పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందనిజైట్లీ చెప్పారు. వనరులు అనుకూలిస్తే గత నవంబర్‌లో కశ్మీర్‌కు ప్రధాని ప్రకటించిన రూ.80 వేల కోట్ల విడుదలకు ప్రయత్నిస్తామన్నారు.హెచ్‌సీయూ, జేఎన్‌యూ ఘటనలు లెఫ్ట్ ప్రేరేపిత ఉద్యమాలని, కొందరు జిహాదీల ప్రమేయం కూడా ఉందన్నారు.

 ఏడో వేతన సంఘం కమిటీపై అభ్యంతరం
 న్యూఢిల్లీ: ఏడో వేతన సంఘం సిఫార్సులపై నివేదిక కోసం ఏర్పాటైన ఉన్నత స్థాయి ప్యానల్‌లో మార్పులు చేయాలని సివిల్ సర్వీస్ అధికారుల ప్రతినిధి బృందం కేంద్రానికి విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ను కలిసింది. 13 మంది సభ్యుల ప్యానల్‌లో ఎనిమిది మంది ఒకే సర్వీసుకు చెందిన వారున్నార ంది. విజ్ఞప్తుల్ని పరిశీలిస్తామని మంత్రి వారికి హామీనిచ్చారు. ఈ బృందంలో ఐపీఎస్, ఐఆర్‌ఎస్, ఐఎస్‌ఎస్ అధికారులున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement