మధ్యాహ్న భోజనంలో బల్లి.. 50 మందికి అస్వస్థత | Dead lizard in Bihar mid-day meal, 50 students ill | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనంలో బల్లి.. 50 మందికి అస్వస్థత

Aug 1 2014 8:17 PM | Updated on Aug 29 2018 7:54 PM

మధ్యాహ్న భోజనంలో బల్లి.. 50 మందికి అస్వస్థత - Sakshi

మధ్యాహ్న భోజనంలో బల్లి.. 50 మందికి అస్వస్థత

బీహార్లో ఓ పాఠశాలలో పెట్టిన మధ్యాహ్న భోజనంలో చనిపోయిన బల్లి ఒకటి బయటపడింది. ఈ ఆహారం తీసుకున్న దాదాపు 50 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు.

బీహార్లో మధ్యాహ్న భోజనం అంటేనే పిల్లలు భయపడాల్సి వస్తోంది. తాజాగా శుక్రవారంనాడు అక్కడ పెట్టిన మధ్యాహ్న భోజనంలో చనిపోయిన బల్లి ఒకటి బయటపడింది. ఈ ఆహారం తీసుకున్న దాదాపు 50 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో జిల్లా అధికారులు స్కూలు ప్రధానోపాధ్యాయుడు సహా ఇద్దరిని సస్పెండ్ చేశారు. వారిద్దరిపైన ఎఫ్ఐఆర్ దాఖలైంది. గడిచిన నెల రోజుల్లోనే బీహార్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఇది నాలుగో సంఘటన.

నౌగాచియా సమీపంలోని రాఘోపూర్లో గల బతారా ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత చాలామంది పిల్లలు తమకు ఇబ్బందిగా ఉందని ఫిర్యాదుచేశారు. వెంటనే వాళ్లను అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అన్నం శాంపిళ్లను సేకరించారు. దోషులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. గత శనివారం నాడు బీహార్లోని బక్సర్ జిల్లాలో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత 12 మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. గడిచిన ఏడు నెలల్లో బీహార్ రాష్ట్రంలో 14 ఫుడ్ పాయిజనింగ్ కేసులు మధ్యాహ్న భోజనాల్లో జరిగాయని విద్యాశాఖాధికారులు తెలిపారు. గత సంవత్సరం శరణ్ జిల్లాలో ఓ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 23 మంది విద్యార్థులు మరణించారు.

Advertisement
 
Advertisement
Advertisement