కరోనా : కొత్త యాప్‌ ప్రారంభించిన ఢిల్లీ సీఎం | Corona: Kejriwal launches new app for patients | Sakshi
Sakshi News home page

కరోనా : కొత్త యాప్‌ ప్రారంభించిన ఢిల్లీ సీఎం

Jun 2 2020 1:58 PM | Updated on Jun 2 2020 2:41 PM

Corona: Kejriwal launches new app for patients - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాస్పిటల్ బెడ్స్, ఇతర సమాచారం కోసం  ‘‘ఢిల్లీ కరోనా" యాప్ ను మంగళవారం ప్రారంభించారు. కరోనా కంటే నాలుగు అడుగులు తమ ప్రభుత్వం ముందే ఉందని, ఆందోళన అవసరం లేదని మరోసారి పునరుద్ధాటించారు. తాజా వీడియో కాన్ఫరెన్స్‌  సందర్భంగా  ఢిల్లీ సీఎం ఈ యాప్‌ను లాంచ్ చేశారు.  కరోనా బారిన పడిన వారి చికిత్స, ఆసుపత్రిలోకావాల్సిన  సౌకర్యాలపై అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.  ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. ఏయే హా‍స్పిటల్‌లో ఎన్నెన్ని పడకలు ఖాళీగా ఉన్నాయో లాంటి వివరాలు లభిస్తాయని తెలిపారు.

కోవిడ్‌-19 రోగులకు ఆసుపత్రి పడకలు,  వెంటిలేటర్లను ట్రాక్ చేయడానికి ఈ మొబైల్ అప్లికేషన్‌ను తీసుకొచ్చామని కేజ్రీవాల్  చెప్పారు. ఇది ఢి‍ల్లీ  ప్రజలందరికీ  ఆసుపత్రి పడకలు, ఇతర అవసరాల లభ్యతమై సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు.  ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ  కేసులు పెరుగుతున్నాయి,  కానీ ఆసుపత్రులలో పడకలు,  ఐసీయూ, ఆక్సిజన్ సహాయానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి కనుక ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు.  ఒకవేళ ఆసుపత్రిలో బెడ్‌ లభ్యత విషయంలో ఏదైనా సమస్య ఏర్పడితే  ప్రజలు హెల్ప్‌లైన్ నెం. 1031కు కాల్‌ చేయవచ్చని  ముఖ్యమంత్రి వెల్లడించారు. వెంటనే వారికి ఒక ఎస్‌ఎంఎస్‌ వస్తుందని వివరించారు. అంతేకాదు యాప్‌ అందుబాటులో లేనివారికోసం ఒక వెబ్‌సైట్‌ కూడా  తీసుకొచ్చినట్టు తెలిపారు. దీంతోపాటు  వాట్సాప్‌ నెంబరు ద్వారా కూడా సమాచారాన్ని పొందవచ్చన్నారు.

ఢిల్లీలో మొత్తం 302 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయనీ, వీటిలో 210 ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ యాప్‌లో సమాచారాన్ని రోజుకు రెండుసార్లు, ఉదయం 10,  సాయంత్రం 6 గంటలకు అప్‌డేట్‌ చేస్తామని దీంతో ప్రజలకు  తాజా వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement