సెలబ్రిటీలపై దేశద్రోహం కేసు; ట్విస్ట్‌ | Bihar Cops Give Clean Chit to 49 Celebrities | Sakshi
Sakshi News home page

సెలబ్రిటీలపై దేశద్రోహం కేసులో మలుపు

Oct 10 2019 9:19 AM | Updated on Oct 10 2019 9:20 AM

Bihar Cops Give Clean Chit to 49 Celebrities - Sakshi

ప్రధాని మోదీకి లేఖ రాసిన 50 మంది ప్రముఖులపై నమోదైన దేశద్రోహం కేసు ఉపసంహరణకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ముజఫర్‌పూర్‌: దేశంలో పెరుగుతున్న మూక దాడులను నిరసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన 50 మంది ప్రముఖులపై నమోదైన దేశద్రోహం కేసు ఉపసంహరణకు ఆదేశాలు జారీ అయ్యాయి. వారిపై బిహార్‌లోని సర్దార్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన దేశద్రోహం కేసును మూసివేయాలని ముజఫర్‌పూర్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ మనోజ్‌కుమార్‌ సిన్హా బుధవారం ఆదేశాలిచ్చారు. నిరాధార ఆరోపణలు చేసిన ఈ ఫిర్యాదుదారుపై విచారణ సాగుతుందని ఓ పోలీసు అధికారి తెలిపారు. వేర్పాటు ధోరణులను బలపరిచేలా బహిరంగ లేఖ రాశారంటూ ముజఫర్‌పూర్‌కు చెందిన సుధీర్‌ కుమార్‌ ఓఝా అనే న్యాయవాది 50 మంది ప్రముఖులపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

దేశంలో మూక దాడులు పెరుగుతుండటాన్ని నిరసిస్తూ మణిరత్నం, అపర్ణాసేన్, కొంకణాసేన్‌, ఆదూర్‌ గోపాలకృష్ణన్, రామచంద్ర గుహ, రేవతి, అనురాగ్‌ కశ్యప్‌, శ్యామ్‌బెనగల్‌ వంటి 50 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మోదీకి జూలైలో లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా, మోదీకి బహిరంగ లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు పెట్టడంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కేసును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ సహా పలు పార్టీలు డిమాండ్‌ చేశాయి. దీంతో బిహార్‌ పోలీసులు వెనక్కుతగ్గారు. అయితే, ఈ కేసుతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ప్రకటించారు. (చదవండి: ప్రముఖులపై రాజద్రోహం కేసు)

Advertisement
 
Advertisement
Advertisement