ఘనంగా ఆకాశ్‌ నిశ్చితార్థం

Akash Ambani-Shloka Mehta engagement - Sakshi

ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ తనయుడు ఆకాశ్‌ అంబానీ నిశ్చితార్థం శనివారం రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, బాలీవుడ్, క్రీడ, పారిశ్రామిక రంగ ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు సురేశ్‌ ప్రభు, మనోజ్‌ సిన్హా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ (కుటుంబ సమేతంగా), ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్, పార్టీ నేత ప్రఫుల్‌ పటేల్, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాక్రే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఆనంద్‌ శర్మ, దిగ్విజయ్‌ సింగ్, మాజీ ఎంపీ ప్రియాదత్‌ తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

వ్యాపార రంగం నుంచి రతన్‌ టాటా, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, కోటక్‌ మహీంద్రా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ ఉదయ్‌ కోటక్, ఆదిత్యా బిర్లా గ్రూపు చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా, జీ గ్రూపు చైర్మన్‌ సుభాష్‌ చంద్ర తదితరులు పాల్గొన్నారు. దక్షిణ ముంబైలో వధువు శ్లోక నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. బాలీవుడ్‌ నుంచి షారుక్‌ ఖాన్‌ (భార్య గౌరీతో కలిసి), రేఖ, అనిల్‌ కపూర్, రణ్‌బీర్‌ కపూర్, విద్యా బాలన్, మాధుర్‌ భండార్కర్, విదూ వినోద్‌ చోప్రా, జావెద్‌ అక్తర్‌లు క్రీడా రంగం నుంచి సచిన్, హర్భజన్, జహీర్‌ ఖాన్‌ తదితరులు ఈ నిశ్చితార్థ కార్యక్రమం విందుకు హాజరయ్యారు. వీరి పెళ్లి డిసెంబర్‌లో జరగొచ్చని తెలుస్తోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top