రఫేల్‌ రగడ : ఎయిర్‌ మార్షల్‌ సిన్హా వివరణ

Air Marshal Sinha Exposes Congress President Rahul Gandhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్‌ ఒప్పందంలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని నిరూపించే క్రమంలోనే రక్షణ మంత్రిత్వ శాఖ నోట్‌లో ఎంపిక చేసుకున్న భాగాన్ని ప్రచారంలోకి తెచ్చారని ఈ ఒప్పందంలో భారత్‌ తరపున సంప్రదింపులు జరిపిన ఎయిర్‌ మార్షల్‌ ఎస్పీబీ సిన్హా పేర్కొన్నారు. నోట్‌లో చెబుతున్న అంశాలేవీ భారత సంప్రదింపుల బృందానికి సంబంధం లేనివని ఆయన స్పష్టం చేశారు.

భారత్‌ తరపున రఫేల్‌ ఒప్పందంపై ఫ్రాన్స్‌తో చర్చలు జరిపిన బృందం సభ్యులంతా ఎలాంటి విభేదాలకు తావులేకుండా ఏడుగురు సభ్యుల సంతకాలతో కూడిన తుది నివేదికను సమర్పించారని పేర్కొన్నారు. ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో అవినీతి నిరోధక క్లాజుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఇప్పటివరకూ అమెరికా, రష్యాలతో ప్రభుత్వం-ప్రభుత్వం మధ్య ఒప్పందాలున్నాయని, ఫ్రాన్స్‌తో ఇది ఈ తరహా మూడవ ఒప్పందమని చెప్పారు. వీటిలో ఇలాంటి క్లాజ్‌ ఇంతవరకూ లేదని తేల్చిచెప్పారు.

రఫేల్‌ ఒప్పందంపై పీఎంఓ ఫ్రాన్స్‌తో సమాంతర చర్చలు జరిపిందంటూ రక్షణ మంత్రిత్వ శాఖ నోట్‌ను ఓ జాతీయ పత్రిక వెల్లడించడంపై కాంగ్రెస్‌ సహా విపక్షాలు మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. పీఎంఓ సమీక్ష జోక్యంగా పరిగణించలేమని రఫేల్‌ ఒప్పందంపై అన్ని అంశాలను ప్రభుత్వం పార్లమెంట్‌, న్యాయస్ధానాల ముందుంచిందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ విపక్షాలకు దీటుగా బదులిచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top