తలాక్‌’ నిందితులకు బెయిల్‌ | abinet approves provision of bail by magistrate | Sakshi
Sakshi News home page

తలాక్‌’ నిందితులకు బెయిల్‌

Aug 10 2018 1:48 AM | Updated on Mar 9 2019 3:59 PM

abinet approves provision of bail by magistrate - Sakshi

న్యూఢిల్లీ: త్రిపుల్‌ తలాక్‌కు సంబంధించి విచారణకు ముందే నిందితులకు బెయిల్‌ మంజూరుచేయడంతో పాటు మరో రెండు రక్షణలు చేర్చుతూ తెచ్చిన సవరణలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. ఈ బిల్లు ఇదివరకే లోక్‌సభలో గట్టెక్కగా, రాజ్యభలో పెండింగ్‌లో ఉంది. పార్లమెంట్‌ సమావేశాలకు చివరి రోజైన శుక్రవారమే సవరించిన బిల్లును కేంద్రం మరోసారి లోక్‌సభలో ప్రవేశపెట్టే వీలుంది. భార్య వాదనలు విన్న తరువాతే భర్తకు మెజిస్ట్రేట్‌ బెయిల్‌ ఇచ్చేలా నిబంధన చేర్చామని, అయినా ట్రిపుల్‌ తలాక్‌..బెయిల్‌కు అర్హంకాని నేరంగానే కొనసాగుతుందని న్యాయశాఖ మంత్రి చెప్పారు.

బిల్లులో కీలక సవరణలు..
► పోలీస్‌ స్టేషన్‌లోనే నిందితుడికి బెయిల్‌ లభించదు(అంటే ట్రిపుల్‌ తలాక్‌ నేరం నాన్‌–బెయిలబుల్‌గా ఉంటుంది)
► భార్యకు పరిహారం ఇచ్చేందుకు భర్త అంగీకరించాకే మేజిస్ట్రేట్‌ బెయిల్‌ ఇస్తారు. పరిహారం ఎంతనేది మేజిస్ట్రేట్‌ ఇష్టం.
► బాధితురాలు లేదా ఆమె రక్త సంబంధీకులు ఫిర్యాదు చేస్తేనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు.
► కేసును ఉపసంహరించుకునే స్వేచ్ఛను ఇరు పక్షాల(భార్య, భర్త)కు కల్పించారు. మేజిస్ట్రేట్‌ తన అధికారాలతో భార్యాభర్తల మధ్య సయోధ్యకు ప్రయత్నించొచ్చు.
► మైనారిటీ తీరని పిల్లల సంరక్షణను తనకు అప్పగించాలని భార్య చేసుకున్న విజ్ఞప్తిని మేజిస్ట్రేట్‌ పరిశీలిస్తారు.


కేబినెట్‌ ఇతర నిర్ణయాలు
► గిడ్డంగుల్లో నిల్వ ఉన్న సుమారు 35 లక్షల టన్నుల పప్పుదినుసులను రాయితీపై రాష్ట్రాలకు విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. మార్కెట్‌ ధర కన్నా కిలోకు రూ.15 తక్కువకే రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలకు కేంద్రం విక్రయించనుంది.
► ఓబీసీ కులాల ఉపవర్గీకరణకు జస్టిస్‌ జి.రోహిణి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పదవీకాలం నవంబర్‌ వరకు పొడిగింపు.
► తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మృతికి కేంద్ర కేబినెట్‌ సంతాపం ప్రకటించింది. మంత్రి మండలి సభ్యులు  మౌనంవహించి నివాళులు అర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement