ఎయిర్పోర్ట్ల ప్రైవేటీకరణ ప్రక్రియ ముమ్మరం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుతం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహణలో ఉన్న ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతమైంది. వీటి నిర్వహణ కోసం పది కంపెనీల నుంచి మొత్తం 32 సాంకేతిక బిడ్స్ను ఏఏఐ స్వీకరించింది. గౌహతి, తిరువనంతపురం, లక్నో, మంగళూర్, అహ్మదాబాద్, జైపూర్ విమానాశ్రయాల నిర్వహణ, ఆపరేషన్స్, అభివృద్ధి కోసం అంతర్జాతీయ బహిరంగ బిడ్డింగ్ ప్రక్రియ కింద బిడ్లను ఆహ్వానించింది.
ఈ ఆరు విమానాశ్రయాల నిర్వహణ కోసం మొత్తం పది కంపెనీల నుంచి 32 సాంకేతిక బిడ్స్ అందాయని ఏఏఐ వర్గాలు వెల్లడించాయి. సాంకేతిక బిడ్స్కు ఈ నెల 14 ఆఖరు తేదీ కాగా, ఈనెల 28న ఫైనాన్షియల్ బిడ్స్ను ఏఏఐ తెరవనుంది. గెలుపొందిన బిడ్డర్ల వివరాలను ఈనెల 28న ఏఏఐ వెల్లడిస్తుంది. ప్రయాణీకులు సహా వివిధ భాగస్వాములకు అంతర్జాతీయ మౌలిక వసతులు కల్పించేందుకు ఈ ఆరు విమానాశ్రయాలను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో అభివృద్ధిపరచేందుకు ఏఏఐ ఈ చర్యలు చేపట్టింది.