రాజస్తాన్‌ సర్కారు దవాఖానాలో దారుణం

77 kids die in Kota hospital this month - Sakshi

ఒక్క నెలలోనే 77 మంది శిశువులు మృత్యువాత

కోటా ప్రభుత్వ ఆస్పత్రిలో వసతులు మృగ్యం

జైపూర్‌: రాజస్తాన్‌ రాష్ట్రం కోటా నగరంలోని జేకే లోన్‌ తల్లీ పిల్లల ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్క డిసెంబర్‌ నెలలో ఇప్పటి వరకు 77 మంది శిశువులు మృత్యువాతపడ్డారు. ఆస్పత్రిలో అసౌకర్యాలు, పనిచేయని పరికరాల కారణంగానే వీరంతా మృతి చెందినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌ పూనియా ఆరోపించారు. ఇంత దారుణం జరిగినా ప్రభుత్వంలో చలనం లేదని, మంత్రులెవరూ ఆస్పత్రికి వెళ్లి సమీక్షించిన దాఖలాల్లేవని మండిపడ్డారు.

అయితే, గడిచిన ఆరేళ్ల గణాంకాలతో పోలిస్తే ఇవే అతి తక్కువ మరణాలని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అంటున్నారు. ‘గతంలో ఇక్కడ ఏడాదికి 1,500 మంది శిశువులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో, ప్రతి ఆస్పత్రిలో రోజుకు కనీసం ఐదారుగురు పసివాళ్లు చనిపోతూనే ఉంటారు. ఇక్కడా అదే జరుగుతోంది. జేకే ఆస్పత్రిలో శిశు మరణాలను సీరియస్‌గా తీసుకుని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను విధుల నుంచి తొలగించాం’ అని వివరించారు. కాగా, పసికందుల మృతిపై కోటా నియోజకవర్గ ఎంపీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top