కారు ఆపిన ట్రాఫిక్‌ పోలీస్‌.. ‘గుండెపోటు’

34 year old Techie Dies Of Heart Attack After Spat With Traffic Cops in Ghaziabad - Sakshi

నోయిడా : నూతన మోటారు వాహన సవరణ చట్టం వచ్చాక వాహనదారుల కష్టాలు పెరిగిపోయాయి. ఈ చట్టం పేరుతో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ పోలీసు తనిఖీల పేరుతో ఓవర్‌ యాక్షన్‌ చేయడంతో ఓ సాఫ్ట్‌వేర్‌ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.

ఘజియాబాద్‌కు చెందిన 35 సంవత్సరాల ఓ సాఫ్ట్‌వేర్‌ తన తల్లిదండ్రులతో కలసి కారులో వెళ్తుండగా పోలీసులు అతడిని ఆపారు. ఓ పోలీసు లాఠీతో కారును గట్టిగా కొడుతూ కారు పత్రాలు చూపించమని అడగడంతో కోపం వచ్చిన ఆ టెక్కీ.. పోలీసుతో వాగ్వాదానికి దిగాడు. దీంతో రెచ్చిపోయిన ఆ పోలీసు అతన్ని తీవ్రంగా హెచ్చరించడంతో ఉన్నట్టుండి గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కుప్పకూలాడు. చదవండి : లుంగీకి గుడ్‌బై చెప్పకపోతే.. మోత మోగుడే

ఈ హఠాత్పరిణామం నుంచి కారులో ఉన్న అతని తల్లిదండ్రులు తేరుకునేలోపే అతను చనిపోయాడు. పోలీసు దురుసుగా ప్రవర్తించినందుకే తమ కుమారుడు చనిపోయాడని అతని తండ్రి ఆవేదనవ్యక్తం చేస్తున్నాడు. ‘నా కుమారునికి 5 సంవత్సరాల కూతురు ఉంది. నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు. నడిరోడ్డుపైన ఓ పోలీసు చేసిన పనికి నా కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు నా మనవరాలి భవిష్యత్‌ ఏం కావాలి’ అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఈ ఘటనపై అంతర్గత విచారణ చేస్తున్నామని పోలీస్‌ డిపార్ట్‌మెంటు వెల్లడించింది. ‘చనిపోయిన వ్యక్తికి డయాబెటీస్ ఉంది. గుండెపోటుతో మరణించాడని’ జరిగిన దానిని తక్కువ చేసేందుకు ఓ పోలీస్‌ అధికారి ప్రయత్నించాడు. కాగా దేశవ్యాప్తంగా మోటారు వాహన సవరణ చట్టంపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చట్టం కారణంగా పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాహనదారులను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చదవండి : ‘అందుకే కారులో హెల్మెట్‌ పెట్టుకుంటున్నా’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top