దేశంలో కొత్తగా 3390 కరోనా పాజిటివ్‌ కేసులు

3390 Corona Positive Cases And 103 Deaths Reported In Last 24 Hours - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3390 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,103 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 56,342కి చేరింది. ప్రస్తుతం 37,916 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 16,540 మంది డిశ్చార్జ్ కాగా 1,886 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ ‌అగర్వాల్‌ శుక్రవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. దేశంలో కరోనా రికవరీ రేటు 29.36 శాతం ఉందన్నారు. భారత్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ భాగం మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. (కరోనా: మృతుల్లో నల్ల జాతీయులే అధికం)

ఆ మూడు రాష్ట్రాల్లో దాదాపు 31వేల కరోనా కేసులు నమోదు అయ్యాయన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 17, 974  కేసులు నమోదు కాగా, 694 మంది మృతి చెందారని తెలిపారు. 216 జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదని తెలిపారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పిస్తున్నామని, మాల్దీవుల నుంచి 700 మంది నౌకలో వెనక్కి తెప్పిస్తున్నట్లు చెప్పారు. దీని కొరకు ఇప్పటికే నౌకలు మాల్దీవులకు చేరుకున్నాయని పేర్కొన్నారు.  222 శ్రామిక్ రైళ్లలో 2.5 లక్షల మంది వలసకూలీలను తరలించామని తెలిపారు. (ఈ ఏడాది చివరి వరకు వర్క్‌ ఫ్రం హోమ్‌!)

  • గుజరాత్‌ : 7,012
  • ఢిల్లీ : 5,980
  • తమిళనాడు : 5,409
  • రాజస్తాన్‌ : 3,427
  • మధ్యప్రదేశ్‌ : 3,252
  • ఉత్తరప్రదేశ్‌ : 3,071 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయని లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top