అమ్మా, నాన్న విడిపోవడం సంతోషమే
సినిమా: అమ్మా, నాన్న విడిపోతే ఎవరైనా బాధ పడతారు. అలాంటిది నటి శ్రుతీహాసన్ మాత్రం తనకు సంతోషమే అంటోంది. కమలహాసన్, సారికలు విడిపోయి చాలా కాలం అయింది. కమలహాసన్ చెన్నైలో నివాసం ఉంటుంటే, సారిక ముంబాయిలో ఉంటున్నారు. వారి కూతుళ్లు అయిన శ్రుతీహాసన్, అక్షరహాసన్లు అటు తల్లితోనూ, ఇటు తండ్రితోనూ అనుబంధాలను పెనవేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. అయితే తన తల్లిదండ్రులు విడిపోవడం గురించి కూతుళ్లిద్దరూ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఇటీవల తన తండ్రి కమలహాసన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఈమె ఒక భేటీలో పేర్కొంటూ ఆ విషయంపై తనదైన తీరుతో స్పందించింది.
ఈ సందర్భంగా శ్రుతీహాసన్ మాట్లాడుతూ.. తన జీవితంలో ముఖ్యమైన భాగం నాన్న కమలహాసన్, అమ్మ సారికలదేనని అంది. సాధారణంగా అమ్మానాన్న విడిపోతే ఇతరులకు వార్త అవుతుందేమో, మా కుటుంబంలో మాత్రం అది బాధాకరమైనదే అవుతుంది. అయితే తన వరకూ అమ్మా, నాన్న విడిపోవడం సంతోషకరమేనంది. ఎందుకంటే తన తల్లీ,తండ్రి ఇద్దరూ ఆర్టిస్టులే. ఇద్దరూ ఒకరిపై ఒకరు గొడవ పడుతూ మనశాంతి లేకుండా జీవించడం కంటే విడిపోయి వారి వారి జీవితాలను సంతోషంగా గడపడమే ఉత్తమం అంది. అమ్మానాన్న విడిపోవడం కష్టంగా ఉన్నా, కలిసి జీవించినప్పుడు పలు సమస్యలు వచ్చేవని అంది. అమ్మా,నాన్నలను ఒకటిగా కలపాలని తానూ భావించానని, అయితే వారు మళ్లీ కలిస్తే ఒకరిపై ఒకరు గొడవలు పడి మనశాంతికి దూరం అవుతారంది. అందుకే తానా ప్రయత్నం చేయలేదని నటి శ్రుతీహాసన్ పేర్కొంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో విజయ్సేతుపతికి జంటగా లాభం చిత్రంలో నటిస్తోంది. త్వరలో తెలుగులో రవితేజతో జత కట్టడానికి రెడీ అవుతోంది. అదే విధంగా ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్లో నటించడానికి రెడీ అవుతోంది.
మరిన్ని వార్తలు