ప్రముఖ సినీ నిర్మాత ఏవీఎం శరవణన్ గతేడాది చివర్లో ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడ్డ ఆయన డిసెంబర్ 4న ఉదయం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఎంతోమంది సినీప్రముఖులు ఆయన్ను చివరిసారిగా చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజాగా చెన్నైలోని ఏవీఎం స్కూల్లో శరవణన్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు.
ఆయన నాకు చాలా క్లోజ్
ఈ కార్యక్రమానికి స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. శరవణన్తో నేను 11 సినిమాలు చేశాను. ఆయన తన ఆఫీసులో కూర్చునే.. చాలామందికి అనేక హిట్లు, బ్లాక్బస్టర్లు అందించాడు. కేవలం సినిమాపరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన నాకు చాలా క్లోజ్. శివాజీ సినిమా తర్వాత ఆయన నాకో సలహా ఇచ్చాడు.

అనాథగా మిగిలా..
ఏజ్ పెరిగేకొద్దీ మరింత బిజీగా ఉండాలన్నాడు. కనీసం ఏడాదికో సినిమా అయినా చేయమని సూచించాడు. ఇప్పటికీ నేను ఆ సలహా పాటిస్తున్నాను. మనకు నచ్చినవారిని కాలం తనకు నచ్చినప్పుడు తీసుకెళ్లిపోతుంది. ఎంత డబ్బు, హోదా ఉన్నా సరే నచ్చినవాళ్లు దూరమైనప్పుడు అనాథగా మిగిలాం అన్న భావన కలగకమానదు. శరవణన్ సర్ చాలా గొప్ప వ్యక్తి అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
గర్వంగా ఫీలవుతున్నా.
కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఏవీఎమ్ కుటుంబానితో కలిసి పని చేసినందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. నేను చదువుకునే రోజుల్లో ఏవీఎమ్ స్కూల్ లేదు. ఒకవేళ ఉండుంటేనా.. నేను కూడా అదే పాఠశాలకు వెళ్లేవాడిని. నేను ఏదైనా తప్పులు చేస్తే శరవణన్ నాపై అరిచేవాడు కాదు.
ఏవీఎమ్ బ్యానర్ ద్వారా పరిచయం
కానీ, నేనేదైనా మంచి చేస్తే మాత్రం అందరిముందు పొగిడేవాడు, సంతోషపడేవాడు అని పేర్కొన్నాడు. కమల్ హాసన్.. ఏవీఎమ్ బ్యానర్ ద్వారానే వెండితెరకు పరిచయమయ్యాడు. 1960లో వచ్చిన కలతుర్ కన్నమ్మ సినిమాకుగానూ కమల్ ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు.
చదవండి: సంధ్య థియేటర్లో దారుణం.. లేడీస్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరా


