వెండితెరపై కూతురిని చూడకుండానే..

Sridevi couldn't live to see her jhanvi debut - Sakshi

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ తొలి మహిళా సూపర్‌స్టార్‌గా పేరొందిన శ్రీదేవి తన కూతుళ్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. కూతుళ్లు ఝాన్వీ, ఖుషీ పట్ల ఒక తల్లిగా ఎంతో కేర్‌ తీసుకున్న శ్రీదేవి.. తన పెద్ద కూతురు సినీ రంగ ప్రవేశం గురించి కూడా ఎంతో ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. ఒక నటిగా, హీరోయిన్‌గా ఎన్నో దశాబ్దాలు సినీ పరిశ్రమలో కొనసాగిన ఆమె.. తన కూతురి ఆరంగేట్రం విషయంలో ఒకవైపు ఎక్సైట్‌ అవుతూనే.. మరోవైపు ఒక తల్లిగా ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. తన కూతురు కెరీర్‌ గురించి కొంత మథనపడ్డారు.

కూతురి బాలీవుడ్‌ ఆరంగేట్రం గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘తను (ఝాన్వీ) సినీ రంగాన్ని ఈ వృత్తిగా ఎంచుకుంది. నేను ఎంతోకాలంగా ఈ పరిశ్రమలో ఉన్నాను. తన కన్నా ఎక్కువగా నేనే సంసిద్ధమై ఉన్నాను. తను నన్ను చూస్తూ పెరిగింది. సినీ రంగంలోకి రావడమంటే ఏమిటో తనకు తెలుసు. ఏ వృత్తిలోనైనా ఏది అనుకున్నంత సులువు కాదు. తను చాలా కష్టపడాల్సి ఉంటుంది. తనకు సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కోవడానికి తను సంసిద్ధంగా ఉందని నేను అనుకుంటున్నాను’ అని శ్రీదేవి తెలిపింది.

విషాదమేమిటంటే.. ఝాన్వీ బాలీవుడ్‌ ఆరంగేట్రం గురించి ఎంతో శ్రద్ధ తీసుకున్న శ్రీదేవి.. మరికొద్ది నెలల్లో కూతురు వెండితెరపై కనిపించేందుకు సిద్ధమవుతుండగా చూసేందుకు తను లేదు. ఇషాన్‌ కట్టర్‌ సరసన ‘ధడక్‌’ సినిమాతో ఝాన్వీ బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదల కానుంది. కానీ, తన బాటలో సాగుతూ సిని పరిశ్రమలో అడుగుపెట్టిన ఝాన్వీ తొలి సినిమాలో ఎలా నటించిందీ చూడటానికి, ఒక తల్లిగా గర్వపడటానికి శ్రీదేవి ఇప్పుడు మనమధ్య లేకపోవడం.. ఆమె కుటుంబానికి, అభిమానులకు తీరని విషాదమే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top