2.0 @ 2:28:52

 Rajinikanth's 2.O Pre-Release Business Touching the Sky - Sakshi

కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయింది. 29వ తేదీ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రజనీకాంత్‌ ‘2.ఓ’ థియేటర్లోకి వచ్చే రోజు అది. రజనీకాంత్, అక్షయ్‌ కుమార్, అమీజాక్సన్‌ ముఖ్య తారలుగా శంకర్‌ దర్శకత్వంలో దాదాపు 550 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 2010లో వచ్చిన ‘ఎందిరిన్‌’ చిత్రానికి ‘2.ఓ’ సీక్వెల్‌ అనే విషయం తెలిసిందే. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యయని కోలీవుడ్‌ సమాచారం.

నిడివి 2గంటల 28నిమిషాల 52 సెకన్లు అట. సెన్సార్‌ టీమ్‌ ఎటువంటి కట్స్‌ చెప్పలేదు కానీ కొన్ని పదాలను మ్యూట్‌ చేయమని అడిగారట. ఇంకో విషయం ఏంటంటే... ఇప్పటివరకూ శంకర్‌ దర్శకత్వం వహించిన ‘జెంటిల్‌మేన్, భారతీయుడు, అపరిచితుడు, రోబో’ తదితర చిత్రాల్లోకెల్లా ‘2.ఓ’ సినిమా నిడివి తక్కువని కోడంబాక్కమ్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే... రజనీకాంత్‌ కెరీర్‌లో 1995లో విడుదలైన ‘ముత్తు’ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 23న జపాన్‌లోని టోక్యోలో రీ–రిలీజ్‌ చేయాలనుకుంటున్నారని కోలీవుడ్‌లో వినిపిస్తోంది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top