
‘‘సినిమా మీద ప్రేమతో మంచి ఉద్యోగాన్ని వదులుకున్నాను. కలను సాకారం చేసుకునేందుకు లాస్ ఏంజిల్స్లో ఫిల్మ్మేకింగ్ కోర్స్ నేర్చుకున్నాను. నేను తీసిన షార్ట్ ఫిల్మ్స్కి వచ్చిన ప్రసంశలు, ప్రోత్సాహంతో ఈ సినిమాను రూపొందించా’’ అన్నారు దర్శక–నిర్మాత గోవర్థన్ గజ్జల. చంద్రకాంత్, రాధికా మెహరోత్రా, పల్లవి డోరా ముఖ్య పాత్రల్లో మిత్రుల సహకారంతో ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘ప్రేమ ఎంత మధురం... ప్రియురాలు అంత కఠినం’. తనికెళ్ళ భరణి, తులసి, ‘జెమిని’ సురేశ్ నటించిన ఈ చిత్రం ఈ నెల 17 విడుదల కానుంది.
గోవర్థన్ మాట్లాడుతూ– ‘‘కొందరు సినిమా ప్రముఖులకు, సన్నిహితులకు సినిమా చూపించాను. బాగుందని మెచ్చుకున్నారు. లవ్లో సక్సెస్ అయ్యేందుకు అమెరికా వెళ్లిన ఓ కుర్రాడి జీవితంలోకి మరో అమ్మాయి వస్తుంది. అప్పుడు అతని జీవితం ఎలాంటి టర్నింగ్స్ తీసుకున్నది అన్నదే చిత్రకథ. ఇది ట్రయాంగిల్ లవ్స్టోరీ కాదు. ఈ సినిమా విడుదల విషయంలో నిర్మాత బెక్కం వేణుగోపాల్ అందించిన ప్రోత్సాహానికి రుణపడి ఉంటాను. ఈ సినిమా కోసం వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చాలా త్యాగాలు చేశాను. అవుట్పుట్ చూశాక నేను పడిన కష్టాలన్నింటినీ మరచిపోయాను’’ అన్నారు.