శ్రీవారి కల్యాణంలో... | 'Om Namo Venkatesha' shoot turns Annapurna studio | Sakshi
Sakshi News home page

శ్రీవారి కల్యాణంలో...

Jul 26 2016 12:16 AM | Updated on Jul 21 2019 4:48 PM

శ్రీవారి కల్యాణంలో... - Sakshi

శ్రీవారి కల్యాణంలో...

‘శ్రీరామ నీ నామం ఎంతో మధురం.. ఎంతో మధురం...’ అని ‘శ్రీరామదాసు’ చిత్రంలో నాగార్జున పాడుతుంటే థియేటర్లలో ప్రేక్షకులు

 ‘శ్రీరామ నీ నామం ఎంతో మధురం.. ఎంతో మధురం...’ అని ‘శ్రీరామదాసు’ చిత్రంలో నాగార్జున పాడుతుంటే థియేటర్లలో ప్రేక్షకులు భక్తి పారవశ్యంలో మునిగితేలారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ, నాగార్జున నటన... వెండితెరపై శ్రీరామ భక్తుడు రామదాసు కథను సాక్షాత్కరింపజేశాయి. ఈ కలయికలో వచ్చిన ‘అన్నమయ్య’, ‘శిరిడీ సాయి’ చిత్రాలు కూడా భక్తిపారవశ్యంలో ఊయల ఊగించాయి. తాజాగా వీరిద్దరి కలయికలో రూపొందుతున్న భక్తిరసాత్మక చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’.
 
 ఈ చిత్రం కోసం అన్నపూర్ణ స్టూడియోలో తిరుమలను తలపించేలా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం సెట్ వేశారు. ఇటీవల ఈ సెట్‌లో శ్రీవారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కల్యాణానికి చిత్రబృందంతో పాటు సాధారణ ప్రజలూ హాజరయ్యారు. భగవంతుడి ఆశీస్సులతో కల్యాణం కన్నుల పండగగా జరిగిందని చిత్రబృందం పేర్కొంది. నాగార్జున, ఆయన సతీమణి అమల, చిత్రనిర్మాత ఎ.మహేశ్ రెడ్డి తదితరులు ఈ కల్యాణత్సవంలో పాల్గొన్నారు. అనుష్క, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో వెంకన్న భక్తుడు హాథీరాం బాబా పాత్రను నాగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement