హీరో అక్కినేని నాగార్జున అభిమానులకు శుభవార్త. ఆయన హీరోగా నటించిన క్లాసిక్ హిట్ మూవీ 'గీతాంజలి' మరోసారి వెండితెరపైకి వస్తోంది. ఈ నెల 29న నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 28న శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా తెలుగు, తమిళంలో బూర్లె శివ ప్రసాద్ 4కెలో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున, గిరిజ జోడీగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన మూవీ ఇది. ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 1989 మే 12న విడుదలై, ఎవర్గ్రీన్ క్లాసిక్స్లో ఒకటిగా నిలిచింది.
ఇప్పుడు నాగార్జున బర్త్ డే సందర్భంగా ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ‘‘గీతాంజలి’ అంటే ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తొచ్చేది అందమైన ప్రేమకథ, మనసును తాకే సంగీతం, అద్భుతమైన విజువల్స్, గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్. నాగార్జునని ఎంతో ఛార్మింగ్గా, ఎమోషనల్గా చూపించిన ఈ సినిమా ఆయన కెరీర్లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది.
మణిరత్నం తనదైన స్టోరీ టెల్లింగ్తో ఈ ప్రేమకథను ఒక అందమైన కవితలా తెరకెక్కించారు. ఇళయరాజా అందించిన సంగీతం సినిమాకు మరో బలంగా నిలిచి, ‘గీతాంజలి’ని క్లాసిక్గా మార్చింది. 4కే ఫార్మాట్లో ‘గీతాంజలి’ని చూడటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అని బూర్లె శివ ప్రసాద్ తెలిపారు.


