దిగివచ్చింది ‘నేల’వంక

Nela Ticket Team Sucess Meet In Visakhapatnam Beach - Sakshi

‘నేలటిక్కెట్టు’ డైరెక్టర్‌ కళ్యాణ్‌కృష్ణ

సాగరతీరంలో చిత్ర విజయోత్సవం

జోష్‌ నింపిన హీరోయిన్‌ మాళవికశర్మ

సందడి చేసిన మాళవిక : నేలటిక్కెట్‌ సినిమా విజయోత్సవాల్లో భాగంగా ఆ చిత్ర బృందం గురువారం నగరంలో సందడి చేసింది. చిత్ర దర్శకుడు కల్యాణ్‌కృష్ణ, హీరోయిన్‌ మాళవిక శర్మ తదితరులు సాగరతీరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. హీరోయిన్‌ మాళవిక శర్మ డ్యాన్సులతో అభిమానులను ఉర్రూతలూగించారు.

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): నేటి తరం బిజీ లైఫ్‌లో పడి మరిచిపోతున్న మానవతా విలువలను గుర్తుచేసేందుకే ‘నేలటిక్కెట్టు’ సినిమా తీశానని చిత్ర డైరెక్టర్‌ కళ్యాణ్‌కృష్ణ అన్నారు. రవితేజ నటించిన ఈ సినిమాకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో సాగరతీరంలో వీరు మామ వీటీం ఆధ్వర్యంలో చిత్ర విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ కళ్యాణ్‌ కృష్ణ మాట్లాడుతూ సమాజంలో ప్రతీ ఒక్కరూ మానవత ధృక్పదంతో నడుచుకోవాలని చిత్రంలో చూపించామన్నారు. ఎంత డబ్బు ఉన్నా పది మంది మనుషులు మనచుట్టూ ఉంటేనే గొప్ప అనేది చెప్పామన్నారు. ‘నేలటిక్కెట్టు’ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తాను వైజాగ్‌కు చెందిన వాడినని అందుకే సిటీ అంటే ఇష్టమన్నారు. తాను చిన్నప్పుడు చూసిన ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌ చేయడానికి ఇష్టపడతానని, అందుకే ప్రతీ సినిమా విశాఖలో షూటింగ్‌ చేస్తున్నానని తెలిపారు. హీరోయిన్‌ మాళవికశర్మ మాట్లాడుతూ ఈ చిత్రం తనకు మంచి గుర్తింపు ఇచ్చిందన్నారు.

మొదటి చిత్రం కావడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను తొలిసారిగా విశాఖ వచ్చానన్నారు. విశాఖ ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉందన్నారు. నేలటిక్కెట్టు సినిమాను ప్రతీ ఒక్కరూ చూడదగ్గ చిత్రమన్నారు. చిత్రంలో మత్స్యకారుడి పాత్ర పోషించిన డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉద్యోగంలో జాతీయ అవార్డులు పొందినప్పుడు రాని ఆనందం సినిమాల్లో నటించినప్పుడు వచ్చిన గుర్తింపుతో పొందుతున్నానన్నారు. కళ్యాణ్‌ కృష్ణ నాలోని నటుడిని గుర్తించి రారండోయ్‌ వేడుక చూద్దాం చిత్రంలో అవకాశం ఇచ్చారన్నారు. అప్పటి నుంచి చాలా మంచి క్యారెక్టర్లు వస్తున్నాయన్నారు. ఇటీవల కాలంలో కొంతమంది సినిమాలను చూడకుండా రివ్యూలను రాసి ప్రేక్షకులను తప్పు దోవ పట్టిస్తున్నారన్నారు. వాటికితోడు కొన్ని రాజకీయలు తోడై ‘నేలటిక్కెట్టు’ చిత్రాన్ని ఆడకుండా చేయాలని అనుకున్నారని, అయితే ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారన్నారు. వేడుకల్లో భాగంగా హీరోయిన్‌ మాళవిక చేసిన డ్యాన్స్‌ ప్రేక్షకుల్లో జోష్‌ నింపించింది. ఈ సందర్భంగా పదో తరగతిలో ప్రతిభ చూపిన 25 మంది విద్యార్థులకు రూ. 2 వేల చొప్పున చెక్కులు అందజేశారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వీరు మామ వ్యవహరించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top