ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

Mehreen Kaur Pirzada To Act With Dhanush Film - Sakshi

చెన్నై :  ఆ సినిమాలో అంతా కట్టే అంటోంది నటి మెహరీన్‌. మోడలింగ్‌ రంగం నుంచి వెండితెరకు దిగుమతి అయిన పంజాబీ బ్యూటీ ఈ అమ్మడు 2016లో కృష్ణగాడి వీర ప్రేమగాథ అనే తెలుగు చిత్రం ద్వారా కథానా యకిగా పరిచయం అయ్యింది. 2017లో నెంజిల్‌ తుణివిరుందాల్‌ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత బాలీవుడ్‌కు వెళ్లింది. నాలుగు భాషల్లో నటిస్తున్నా స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ కోసం తంటాలు పడుతూనే ఉందనే చెప్పాలి. ఈ అమ్మడికి తెలుగులో ఇటీవల ఎఫ్‌–2 చిత్రంతో మంచి సక్సెస్‌ వరించింది. అయినా స్టార్స్‌తో నటించే అవకాశాలు అంతంత మాత్రమే. ముఖ్యంగా తమిళంలో సుశీంద్రన్‌ దర్శకత్వంలో విష్ణువిశాల్‌కు జంటగా నటించిన నెంజిల్‌ తుణివిరుందాల్‌ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దీని గురించి ఇటీవల ఒక భేటీలో ఈ బ్యూటీ మాట్లాడుతూ.. ఆ చిత్రంలో తాను నటించిన సన్నివేశాలన్నీ ఎడిటింగ్‌ రూంకే పరిమితం అయ్యాయని చెప్పింది. ఒక నటికి తాను నటించిన సన్నివేశాలను ఎడిటింగ్‌లో తీసేస్తే ఎంత బాధగా ఉంటుందో, మాటల్లో చెప్పలేనంది.

అయితే చిత్ర నిడివి అధికం కావడం కారణంగా తాను నటించిన సన్నివేశాలను కట్‌ చేసినట్లు చిత్ర దర్శకుడు సుశీంద్రన్‌ తనకు ముందే చెప్పారని పేర్కొంది. కొన్ని సమయాల్లో మనల్ని దాటి కొన్ని విషయాలు జరిగిపోతాయని, ఇదీ అలాంటిదేననీ తనను తాను సర్ది చెప్పుకున్నానని అంది. ముచ్చటగా మూడోసారి కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది. ఈ సారి ధనుష్‌తో రొమాన్స్‌ చేయనుంది. దురై సెంధిల్‌కుమార్‌ దర్శత్వంలో సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధనుష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయనకు జంటగా స్నేహ, మెహరీన్‌ నటిస్తున్నారు. దీనికి పటాస్‌ అనే టైటిల్‌ను ఇటీవలే వెల్లడించారు. ఈ చిత్రం గురించి మెహ్రిన్‌ మాట్లాడుతూ.. ధనుష్‌ ఎలాంటి సన్నివేశాన్నైనా సింగిల్‌ టేక్‌లో నటించేస్తారని చెప్పింది. ధనుష్‌ సంభాషణల ఉచ్ఛరింపు గురించి తనకు నేర్పించేవారని చెప్పింది. తమిళ భాషను ఇప్పుడే నేర్చుకుంటున్నానని మెహరీన్‌ తెలిపింది. మరి ఈ చిత్రం అయినా ఈ బ్యూటీకి కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చిపెడుతాందా? లేదో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top